ఆంధ్రజ్యోతిపై చిచ్చు!: ఒంటరిగా వెళ్తేనే.. అంతా నిజమేనని బొత్సకు టిడిపి కౌంటర్
ఏపీలో ఆంధ్రజ్యోతి చేసిన సర్వే పైన అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది.
విజయవాడ: ఏపీలో ఆంధ్రజ్యోతి చేసిన సర్వే పైన అధికార తెలుగుదేశం పార్టీ, విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. సర్వేను వైసిపి నేత బొత్స సత్యనారాయణ కొట్టి పారేశారు. టిడిపి మాత్రం సమర్థిస్తోంది.
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ సర్వే నూటికి నూరు శాతం నిజమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోమవారం చెప్పారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే ప్రయోజం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సర్వేపై చంద్రబాబుకు ఝలక్, సీనియర్లతో జగన్ భేటీ!
కాగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, తెలుగుదేశం-బీజేపీ కలసి పోటీ చేస్తే 120 అసెంబ్లీ సీట్లు, బీజేపీకి కటీఫ్ చెప్పి, తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే 140 సీట్ల వరకూ వస్తాయని ఈ సర్వే పేర్కొంది.
బీజేపీతో విడిపోతే, ముస్లిం, మైనారిటీ వర్గాల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడతాయని, ఆ కారణంగానే చంద్రబాబు బలం మరింతగా పెరుగుతుందని ఆంధ్రజ్యోతి సర్వే చెప్పింది.
ఆంధ్రజ్యోతి 23 స్థానాల్లో సర్వే నిర్వహించింది. గత ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి 46.63 శాతం ఓట్లు పొందింది. తాజా సర్వేలో 46.53 శాతం వచ్చాయి. అయితే, మొత్తంగా సాధించే సీట్ల సంఖ్యలో మాత్రం కొంత మెరుగుదల కనిపించింది. అప్పుడు కూటమికి 106 (102+4) అసెంబ్లీ స్థానాలు రాగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 120 వస్తాయని సర్వే తేల్చింది. ఇందుకు కారణం... ప్రతిపక్షమైన వైసీపీ మరింత బలహీనపడడమే.
సర్వే నిర్వహించిన 23 నియోజకవర్గాల్లో 2014లో వైసీపీకి 43.2 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు ఆ పార్టీ నవ్యాంధ్రలో 67 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ఓట్లు 36.8 శాతానికి, సీట్ల సంఖ్య 50కి పడిపోతుందని సర్వే లెక్క వేసింది. దీనిపై వైసిపి ఆగ్రహం వ్యక్తం చేసింది.