ఆ ప్రాచీన శివాలయంలో తెలుగు ఐఎఎస్ రోహిణి సింధూరి పేరు మీద ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా?
బెంగళూరు: రోహిణి సింధూరి. తెలుగు ఐఎఎస్ అధికారిణి. కన్నడిగులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రభుత్వాన్ని, అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లను ఏ మాత్రం లెక్కచేయని ఫైర్ బ్రాండ్ అధికారిణిగా పేరుంది. అందుకే ఆమె కేరీర్ లో బదిలీలు అధికం. రోహిణి సింధూరి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఓ ప్రాచీన శివాలయంలో ఆమె పేరు మీద ప్రతి సోమవారమూ ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు.

తొమ్మిదో శతాబ్దానికి చెందిన ఆలయం..
కర్ణాటకలోని హసన్ లో ఉందా శివాలయం. దొడ్డ బాసడి ప్రాంతంలోని విరూపాక్షేస్వర స్వామివారి ఆలయం అది. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతన శివాలయం. 913లో దీన్ని నిర్మించినట్లు ఆలయం ఆవరణలో ఉన్న శాసనాల చెబుతున్నాయి. అంతటి ప్రాచీన ఆలయంలో ఓ ఐఎఎస్ అధికారిణి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహిస్తోండటం చర్చనీయాంశమైంది. దీనికి ప్రధాన కారణం- ఆలయ జీర్ణోద్ధరణకు హసన్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ గా రోహిణి సింధూరి తీసుకున్న చొరవే.

దయనీయ స్థితిలో..
తొమ్మిదవ శతాబ్దానికి చెందిన శివాలయం అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం రోహిణి సింధూరి దృష్టికి వచ్చింది. ఆ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆదరణకు నోచుకోలేదు. ఫలితంగా- భక్తుల నుంచి అందే విరాళాలు, హుండీ ఆదాయం, టికెట్లు, ప్రసాదాల విక్రయాల మీద వచ్చే ఆదాయం మీదే ఆధారపడిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న ఆమె స్వయంగా ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

30 లక్షల రూపాయలు విడుదల..
ఆ వెంటనే- ఆలయ జీర్ణోద్ధరణ కోసం ఒకేసారి 30 లక్షల రూపాయలను విడుదల చేశారు. విద్యుత్ సరఫరాను కల్పించారు. మౌలిక సదుపాయాలను కల్పించారు. ఆలయ స్థలంలో ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపట్టారు. అద్దె రూపంలో కూడా ఆలయానికి ప్రతినెలా ఆదాయాన్ని వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ చర్యలను చేపట్టిన కొద్దిరోజులకే ఆమె హసన్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బదిలీ అయ్యారు.

ప్రతి సోమవారమూ రుద్రాభిషేకం..
రోహిణి సింధూరి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం ఆలయ రూపురేఖలు మారిపోయాయని, అందుకే తాము ప్రతి సోమవారం పేరు మీద రుద్రాభిషేకం చేస్తున్నామని ఆలయ అర్చకుడు హెచ్ ఎన్ నాగభూషణ తెలిపారు. రోహిణి సింధూరి కుటుంబం సభ్యుల పేరు మీద విరూపాక్షేశ్వరుడికి తొలి పూజలు చేస్తున్నామని చెప్పారు. ఇన్నేళ్లుగా తాము చాలామంది అధికారులకు మొర పెట్టుకున్నప్పటికీ.. ఏ ఒక్కరూ ఆలయ జీర్ణోద్ధరణ గురించి పట్టించుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications