రేప్ చేసి గర్భవతిని చేశాడు: పదేళ్ల జైలు శిక్ష వేసిన కోర్టు
గుంటూరు: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసి, ఆమెను గర్భవతి తేసిన కేసులో దోషికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం - గుంటూరు జిల్లాలోని అమృతలూరు మండలం ఇంటూరుకు చెందిన ఓ యువతికి చిన్నతనంలోనే మెదడువాపు వ్యాధి సోకింది
మానసికంగా ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు తమ వద్దనే ఉంచుకుని సాకుతున్నారు. ప్రి రోజూ ఇంటికి సమీపంలోని ఎడ్ల చావిడి వద్దకు వెళ్లి కొద్దిసేపు గడిపి రావడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలో చావిడి పక్కన నివసించే రేవెళ్ల విజయబాబు ఆమెకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు.
కొన్నాళ్లకు యువతి కడుపు పెద్దగా అవుతుండడం, ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తల్లిదండ్రులు ఆమెను వైద్యుల వద్దకు తీసుకుని వెళ్లారు. వైద్యపరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింది. దీంతో వారు బాధితురాలిని విచారించారు. ఆమె విజయబాబు ఇంటికి తీసుకుని వెళ్లి అతనే అని చూపించడంతో విషయం వెలుగు చూసింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు. కేసు బుధవారంనాడు విచారణకు వచ్చింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన అడిషినల్ అసిస్టెంట్ జడ్జి కె. రాధారత్నం దోషికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.