కొకాకోలాకు కృష్ణానీరు: భగ్గుమన్న తెనాలి
గుంటూరు: కోకాకోలా కంపెనీకి కృష్ణా జలాలను తరలించాలనే కౌన్సిల్ తీర్మానాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన తెనాలి పట్టణ బంద్ జరిగింది.
మంగళవారంనాడు ఉదయం నుండే అఖిలపక్షం నాయకులు పట్టణంలో పర్యటిస్తూ బంద్ నిర్వహించారు. ముందుగా ప్రధానప్రతి పక్షమైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నాబత్తుని శివకుమార్ స్ధానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి భారీ ప్రదర్శన ప్రారంభించారు.
నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలోనికి వెళ్లి విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని బలవంతంగా బయటకు పంపించి వేశారు. అనంతరం కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్తో సహా అన్ని విభాగాలకు తాళాలు వేయించారు.
అక్కడి నుండి భారీ ప్రదర్శనగా అఖిలపక్షం నాయకులు పట్టణంలో పర్యటిస్తూ దుకాణాలను మూసివేయించారు. నాలుగు రోజులు కిందటే నాయకులు బంద్కు పిలుపునిచ్చి సహకరించాలని కోరినప్పటికీ ఉదయం నుండే అత్యధిక దుకాణాలు యధావిధిగా తెరిచి ఉంచారు.
దీనితో నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహిస్తూ తెరిచి ఉంచిన దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. సినిమా హాళ్లు, హోటల్స్, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను సైతం మూసి వేయించారు.
అఖిలపక్ష నాయకుల నిరసన ప్రదర్శన కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తెనాలి డిఎస్పీ సిహెచ్ సౌజన్య పర్యవేక్షణలో సిఐలు బి శ్రీనివాసరావు, వై శ్రీనివాసరావు, యు రవిచంద్ర, ఎస్ఐలు జోగి శ్రీనివాస్, రవీంద్రబాబు తదితరులు భారీ బందోబస్తు నిర్వహించారు.
అఖిలపక్షం ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన బంద్ నేపధ్యంలో స్ధానిక చెంచుపేటలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంద్ సందర్భంగా వైసీపీ, ఇతర పార్టీల నాయకులు ర్యాలీగా చెంచుపేటకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ ఉమేష్చంద్ర విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 70 మంది వరకూ నాయకులు, కార్యకర్తలు మోహరించారు.
దీనితో ఎటువంటి ఘర్షణ చోటు చేసుకోకుండా సిఐలు టిడిపి నాయకులకు సర్దిచెప్పి వెళ్లిపోవాలని కోరారు. అయితే దుకాణాలు స్వచ్చందంగా మూసివేసుకుంటే సరే అలా కాకుండా బలవతంగా దుకాణాలు మూయిస్తే ఊరుకోమని పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి రావి సూర్యకిరణ్తేజ పోలీసులకు చెప్పారు.
అయితే ర్యాలీగా వచ్చిన అఖిలపక్షం నాయకులు అక్కడ ఉన్న టిడిపి నాయకులతో కరచాలనం చేసి వెళ్లిపోయారు. ఎటువంటి ఘర్షణ జరుగకపోవడంతో పోలీసులతో పాటు స్ధానికులు ఊపిరిపీల్చుకున్నారు.