పుంగనూరులో రోజురోజుకు హైటెన్షన్
చిత్తూరు జిల్లా పుంగనూరులో రోజు రోజుకు టెన్షన్ పెరుగుతోంది. రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. 2019 ఎన్నికల్లో తమకు ఓట్లకు డబ్బులు ఇస్తామని ఇచ్చిన టోకెన్లకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ డ్రామాలాడుతోందని, తనపై ఇలాంటి అభాండాలు వేయడానికి కుట్ర పన్నిందని రామచంద్ర ఆరోపించారు. తాను చేపడుతున్న కార్యక్రమాలకు పోలీస్ 30 యాక్ట్ ఉందంటూ అడ్డుకునే పోలీసులకు.. వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు కనపడవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాలుగు రోజుల క్రితం జనసేన నేత రామచంద్రయాదవ్ నేతృత్వంలో పుంగనూరు నియోజకవర్గ రైతు సమస్యలపై రైతుభేరీ నిర్వహించారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుచెప్పారు. వైసీపీకి వ్యతిరేకంగా సభ తలపెట్టారంటూ వైసీపీ కార్యకర్తలు రామచంద్రయాదవ్ ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో ఒక గదిలో ఉండి యాదవ్ తన ప్రాణాలను దక్కించుకున్నారు. ఆ రోజు నుంచి పుంగనూరు మొత్తం ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతోందనే ఆందోళనలో స్థానికులున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు కావడంతో పాటు రామచంద్రయాదవ్ ఇంటిపై దాడి జరగడంతో పట్టణమంతా పోలీసులను మొహరించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం రామచంద్రయాదవ్ పై దాడి జరగడాన్ని ఖండించారు. దీన్నిబట్టి వైసీపీ రాజకీయం అర్థమవుతోందని మండిపడ్డారు.













Click it and Unblock the Notifications