రచ్చ: కొట్టుకున్న కాంగ్, లెఫ్ట్, డికె అరుణకు తెరాస షాక్
ఖమ్మం/మహబూబ్ నగర్: ఖమ్మం జిల్లా రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెసు, సిపిఐ కార్యకర్తలు కొట్టుకున్నారు. పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం రచ్చబండ కార్యక్రమంలో జరిగింది. రచ్చబండ జరుగుతున్న సమయంలో పలువురు సిపిఐ కార్యకర్తలు వచ్చి సమస్యలు పరిష్కరించడం లేదంటూ నిలదీశారు.
అదే సమయంలో సమైక్యవాదం వినిపిస్తున్న కిరణ్ బొమ్మను ఫ్లెక్సీలో ఎలా ఏర్పాటు చేస్తారంటూ ప్రశ్నించారు. కిరణ్ బొమ్మను తొలగించాలని పట్టుబట్టారు. కాంగ్రెసు వర్గాలు ససేమీరా అన్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు కలుగజేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సమీపంలోని దమ్మపేటలో కూడా రచ్చబండ కార్యక్రమం రచ్చ అయింది.
ప్రోటోకాల్ పాటించలేదని..
మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆందోళన చేశారు. మంత్రి డికె అరుణను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అధికారులపై మండిపడ్డారు. రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటో లేనందుకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.