ఏపీలో మిలియన్ మార్చ్ టెన్షన్ : ఇటు ప్రభుత్వం - అటు ఉద్యోగులు..!!
ఛలో విజయవాడ.. సీఎం నివాసం ముట్టడి పిలుపు తో పోలీసులు అలర్ట్ అయ్యారు. సీపీఎస్ రద్దు డిమాండ్ తో ఉద్యోగ సంఘల నేతలు కార్యచరణ తీవ్రతరం చేసాయి. సెప్టెంబర్ 1న ఛలో విజయవాడకు పిలుపు నిచ్చాయి. సీఎం నివాసం ముట్టిస్తామని ప్రకటించాయి. దీంతో..పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని అధికారులు స్ఫష్టం చేసారు. ఇప్పటికే పలు జిల్లాల్లోని ఆందోళనల్లో పాల్గొనే అవకాశం ఉన్న వారికి నోటీసులు ఇస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు.
పోలీసుల ముందస్తు చర్యలు
జిల్లాల నుంచి అమరావతి - విజయవాడకు వచ్చే ఉద్యోగ సంఘాల నేతల గురించి ఆరా తీస్తున్నారు. పోలీసులు నోటీసులు జారీ చేయటం పైన ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల వేళ నాడు జగన్ సీపీఎస్ రద్దు పైన హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిని అమలు చేయనుందుకు నిరసనగా ఏపీసీపీఎస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ ఆందోళనలను పిలుపునిచ్చింది. సీపీఎస్ సభ్యులు, టీచర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. కొందరిని గృహనిర్భంధం చేస్తున్నారు. ఇప్పటికే పలుకేసుల్లో పేర్లు నమోదై ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. సెక్షన్ 149 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ముందస్తుగా నోటీసులు ఇచ్చి నిఘా కొనసాగిస్తున్నారు.
పీఆర్సీ స్థానంలో ప్రత్యామ్నయం పై చర్చలు
ఈ ఏడాది ఫిబ్రవరి 3న పీఆర్సీ డిమాండ్ల కోసం ఉద్యోగులు నిర్వహించిన ఛలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది. నాడు ఆంక్షలను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. ఈ సారి అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే చర్యలు ప్రారంభించారు. మరో వైపు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు చేస్తోంది. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ప్రతిపాదనలు చేసింది. వీటిని ఉద్యోగ సంఘాలు అంగీకరించటం లేదు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామంటే చర్యలు తీసుకోకుండా ఊరుకోవాలా అంటూ మంత్రి బొత్సా ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసామని.. మిగిలిన 5 శాతం హామీల్లో సీపీఎస్ ఉందని చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్ 1 పై ఉత్కంఠ..
చలో విజయవాడ కోసం కొందరు ఉద్యోగులు ముందుగా వచ్చి తలదాచుకున్నారని అనుమానించిన పోలీసులు ముందస్తుగా విజయవాడలోని లాడ్జీలను తనిఖీ చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లోని సుమారు 550 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పోలీసులు సీఆర్పీసీ 149 కింద నోటీసులు జారీ చేశారు. మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మొదలు రాయలసీమ జిల్లాల వరకు నిఘా పెంచారు. దీంతో.. సెప్టెంబర్ 1 న చలో విజయవాడపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఈ సమయంలో మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది..