ఉగ్రవాదుల వ్యూహం: వికారుద్దీన్ను తప్పించడానికేనా?
హైదరాబాద్ : గత వారం రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ అర్థరాత్రి సూర్యాపేట కాల్పులు, ఆ తర్వాత జానకీపురం ఎదురుకాల్పులు, తాజాగా మంగళవారంనాడు జనగామ ఎన్కౌంటర్ వరుస పరిణామాలు ఉగ్రవాదుల వ్యూహాన్ని బయటపెడుతున్నట్లు భావిస్తున్నారు.

సూర్యాపేట బస్టాండులో కాల్పులు జరిపి పారిపోయిన ఉగ్రవాదులు నల్లగొండ జిల్లాలోనే ఎందుకు ఉండిపోయారనే విషయంపై పోలీసులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వికారుద్దీన్ ముఠాను తప్పించడానికే ఉగ్రవాదులు నల్లగొండ జిల్లాలో ఉండిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికారుద్దీన్ను మంగళవారంనాడు వరంగల్ జైలు నుంచి హైదరాబాదుకు తరలిస్తారనే సమాచారం తెలిసిన ఉగ్రవాదాలు అతన్ని తప్పించడానికి పక్కా పథకం చేసి ఉంటారని అనుకుంటున్నారు.

వరంగల్, నల్లగొండ జిల్లాల సరిహద్దుల్లో ఆలేరు వాగు ఉంటుంది. అక్కడ వికారుద్దీన్ను తీసుకు వస్తున్న పోలీసు వాహనంపై దాడి చేయాలనే పథకం రచించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వికారుద్దీన్ ముఠా మంగళవారంనాడు ఆ ప్రాంతంలోనే పోలీసులకు ఎదురు తిరగడానికి ప్రయత్నం చేయడం ఆ అనుమానాలకు తావు ఇస్తోందని అంటున్నారు.
కాగా, వికారుద్దీన్తో పాటు ఇతర ఉగ్రవాదుల మృతదేహాలకు జనగామ ఆస్పత్రిలో పంచనామా చేశారు. ఈ పంచనామాలో పది మంది వైద్యులు, నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు పాల్గొన్నారు. ఆ తర్వాత మృతదేహాలను వరంగల్లోని ఎంజిఎంకు తరలించారు. అక్కడ ఆ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తారు.

ఉగ్రవాదుల చేతుల్లో మరణించిన పోలీసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ఎస్సై సిద్ధయ్య మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. దీంతో తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు ఘటనల్లో నలుగురు పోలీసులు మరణించారు.

జానకీపురం ఎదురుకాల్పుల ఘటనలో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మరణించగా, ఎస్సై సిద్దయ్య తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతు మంగళవారం మరణించారు. ఈ ఘటనలో రామన్నపేట సిఐ బాలగంగిరెడ్డి కూడా గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాగా ఏప్రిల్ 1వ తేదీన సూర్యాపేటలోని హైటెక్ బస్టాండులో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ లింగయ్య, హోంగార్డు మహేశ్ మరణించారు. సిఐ మొగిలయ్య, హోంగార్డు కిశోర్ గాయపడ్డారు.












Click it and Unblock the Notifications