రెండు: రాజధానిపై బాబుకు టిజి వెంకటేష్ హెచ్చరిక, పురంధేశ్వరికి కౌంటర్
కర్నూలు: మాజీ మంత్రి టిజి వెంకటేష్ శనివారం నాడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను 14 జిల్లాలుగా విభజించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి వేసవి రాజధానిని రాయలసీమ ప్రాంతంలో, శీతాకాలంలో ఉత్తరాంధ్రలో పెట్టాలని సూచించారు.
రెండు రాజధానులు ఏర్పాటు చేయకుంటే మళ్లీ విభజన సెగలు తప్పవని ఏపీ సీఎం చంద్రబాబుకు హెచ్చరించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టీజీ వెంకటేష్ కోరారు. కర్నూలులో నిట్, ఐటీ, ట్రిపుల్ ఐటీలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలన్నారు. పట్టిసీమ వల్ల నష్టమేంటో పురందేశ్వరి తెలపాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా సహా సీమ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలన్నారు. టీటీడీలో స్థానికులకు ఉపాధి కల్పించాలని, గుండ్రేపుల, సద్ధేశ్వరం, వేదవతి ప్రాజెక్టులు ప్రారంభించాలన్నారు.
చంద్రబాబు మేధావులను అవమానిస్తున్నారు: శైలజానాథ్
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి విషయానికి సింగపూర్ పైన ఆధారపడటం, మన మేధావులను అవమానపర్చడమేనని మాజీ మంత్రి శైలజానాథఅ అన్నారు. ప్రత్యేక హోదా పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వ పట్టించుకోలేదన్నారు. చంద్రన్న రైతు యాత్రలు విహార యాత్రలుగా ఉన్నాయన్నారు.