బాబు, వెంకయ్యల్ని తిడితే రాదు: హోదాపై టిజి వెంకటేష్, రెండో రాజధాని కావాలి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, కేంద్రమంత్రి, బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడును విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని మాజీ మంత్రి, టిడిపి నేత టిజి వెంకటేష్ సోమవారం నాడు అన్నారు.
కేంద్రంతో స్నేహంగా మెదిలి ప్రత్యేక హోదాను సాధించుకోవాలని సూచించారు. బిజెపితో విభేదిస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుంటే రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ ఆదివారం నాడు హెచ్చరించారు. సిపిఐ ఆధ్వర్యంలో మేథావులు, విద్యార్థులు, రైతులు సహా వివిధ వర్గాలతో కలిసి శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన బస్సు యాత్ర ఆదివారం విశాఖ నగరానికి చేరుకుంది.
ఈసందర్భంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా బిజెపి మంత్రి భవిష్యత్లో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ప్రకటించినప్పటికీ టిడిపి, బిజెపి ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయన్నారు.
విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని సభలో ప్రకటించగా, నాడు విపక్ష నేత వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సాధ్యం కాదంటున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉభయ సభల్లోను తమ గళాన్ని విన్పించాలన్నారు. శ్రీకాకుళంలో ప్రారంభమైన బస్సు యాత్ర 10న ముగుస్తుందని, 11న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
ఆంధ్రామేథావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోదా రాష్ట్ర హక్కుగా గుర్తించాలన్నారు. హోదా సాధించే ప్రయత్నాలను పక్కనపెట్టి సీఎం చంద్రబాబు విదేశీ యాత్రలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను కేంద్రమే భరిస్తుందన్నారు.