కుప్పిగంతులు: టిజి వెంకటేష్, జగన్పై మారెప్ప ఫైర్
విజయవాడ/ న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావుపై రాయలసీమకు చెందిన మంత్రి టిజి వెంకటేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆనాటి హనుమంతుడు రాముడి సేవకుడిగా వ్యవహరించాడని, కలియుగ హనుమంతుడు వి. హనుమంతరావు కుప్పిగంతులు వేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆనాటి హనుమంతుడు దైవాంశ సంభూతుడని, ఈనాటి హనుమంతుడు రాక్షస సంతతివాడని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి పోరాడితే విభజనను ఆపవచ్చునని ఆయన అన్నారు. వారు ముగ్గురు కలిసి పోరాటం చేయాలని ఆయన ఆశించారు. రాష్ట్ర విభజన పేర కేంద్రం ఉరి వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్ బాధితుల సంఘం పెడితే చాలా మంది బయటకు వస్తారని మాజీ మంత్రి మారెప్ప అన్నారు. ఆయన శనివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కొనసాగే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతోనే తల్లిలాంటి కాంగ్రెసును కాదని వైయస్సార్ కాంగ్రెసులో చేరానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజన్న రాజ్యం తెస్తానంటూ వైయస్ జగన్ హిట్లర్ రాజ్యం తీసుకుని వస్తున్నారని మారెప్ప వ్యాఖ్యానించారు. ఎస్సీఎస్టీలకు న్యాయం చేయాలని తాను సుశీల్ కుమార్ షిండేను కోరినట్లు ఆయన తెలిపారు. తాను జెండాలు మోసేవాడిని కానని, ఎజెండాలు మోసేవాడినని ఆయన అన్నారు. రాష్ట్రంలో పర్యటించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటానని ఆయన చెప్పారు.
జగన్ అవగాహనారాహిత్యం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ ముసాయిదా బిల్లు (తెంలగాణ ముసాయిదా బిల్లు)పై చర్చలో పాల్గొంటే విభజనకు అంగీకరించినట్లేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనడం అవగాహనా రాహిత్యమని తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. విభజన త్వరగా జరగాలనే దురుద్దేశంతోనే జగన్ బిల్లుపై చర్చకు అడ్డుపడుతున్నారని ఆయన శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వేసినట్లేనని ప్రజలకు అర్థమైందని యనమల అన్నారు. సభ్యులు కోరితే ముసాయిదా బిల్లుపై ఓటింగు నిర్వహించాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications