నియంతలా: కెసిఆర్పై టిజి వెంకటేష్ ఆగ్రహం, బాబుకు 'కొత్త పార్టీ' హెచ్చరిక
కర్నూలు: మాజీ మంత్రి టిజి వెంకటేష్ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. అదే సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరిక చేశారు.
జెన్కో ఉద్యోగులను తొలగించడం కెసిఆర్కే చెల్లిందని ధ్వజమెత్తారు. విద్యుత్ ఉద్యోగులు చేసే న్యాయపరమైన పోరాటానికి ఏపీ ప్రభుత్వం సాయం చేయాలని సూచించారు. తెలంగాణ కెబినెట్ను ఏడాది పాటు సస్పెండ్ చేసి... సమస్యలు పరిష్కరించాకే అధికారాలు ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించిన కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.
అదే సమయంలో రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే కొత్త ఉద్యమాలు, కొత్త పార్టీలు పుట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.
రాయలసీమ హక్కులు పరిరక్షించకపోతే ఎన్నికల్లోగా రాయలసీమ హక్కుల వేదిక రాజకీయ పార్టీగా అవతరిస్తుందని ప్రకటించారు. కర్నూలును ఏపీకి రెండో రాజధానిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.
బందర్ ఎన్నో ఏళ్ల కల: కొనకళ్ల
బందర్ విమానాశ్రయం ఎన్నో ఏళ్ల కల అని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. బందర్ పోర్టు నిర్మాణం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు రైతులను రెచ్చగొడుతున్నారన్నారు. పోర్టు నిర్మాణానికి భూమిని ఇచ్చే రైతులకు అన్యాయం జరగనివ్వమని చెప్పారు. పోర్టు ఏర్పాటు అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లే అన్నారు.