ఏపీ శాసనసభకు కొత్త స్పీకర్..!! జగన్ లెక్కల్లో ఉన్నదెవరు- తమ్మినేనికి ఏ పదవి..!!
ఏపీలో కేబినెట్ విస్తరణ వ్యవహారం అనేక సమీకరణాలకు కారణమవుతోంది. వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కేబినెట్ ప్రక్షాళన త్వరలో ఉంటుందని చెప్పటం ద్వారా కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరిని సామాజిక సమీకరణాల కారణంగా కొనసాగించాల్సి రావచ్చని సీఎం చెప్పారు.
మంత్రి పదవులు కోల్పోతున్న వారికి జిల్లా అధ్యక్ష పదువు లు..అదే సమయంలో మంత్రి పదవుల కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా.. కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతున్న సమయంలో... జిల్లాలు - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రుల తొలిగింపు - కొత్తగా అవకాశాలు దక్కనున్నాయి. అదే సమయంలో గతంలో ఇచ్చిన హామీలు..పార్టీ పట్ల విధేయత.. సమర్ధత సైతం పరిగణలోకి తీసుకోనున్నారు.
జగన్ లెక్కలపై నేతల్లో టెన్షన్
2024 ఎన్నికల టీం కావటంతో సీఎం జగన్ సైతం ఆచి తూచి ఎంపికలో అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో..కొత్త మంత్రివర్గంలో ఇప్పుడు ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే దాని పైన వైసీపీలోనే భిన్న వాదనలు.. లెక్కలు వినిపిస్తున్నాయి. తొలి విడత కేబినెట్ కూర్పు సమయంలోనే ప్రస్తుత స్పీకర్ తమ్మినేనికి మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది.
కానీ, అనూహ్యంగా ఉత్తరాంధ్ర.. శ్రీకాకుళం జిల్లా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం కు అనూహ్యంగా స్పీకర్ పదవికి ఎంపిక చేసారు. కానీ, ఇప్పుడు ఆయన స్థానంలో స్పీకర్ గా కొత్త వారిని ఎంపిక చేసి..తమ్మినేనికి కేబినెట్ లో స్థానం కల్పిస్తారనే చర్చ వైసీపీ ముఖ్య నేతల్లో బలంగా వినిపిస్తోంది. అయితే, సామాజిక సమీకరణాలు పక్కగా అమలు చేసే ముఖ్యమంత్రి బీసీ వర్గానికి చెందిన స్పీకర్ ను మార్చితే..తిరిగి బీసీ వర్గానికే ఆ అవకాశం ఇస్తారని భావిస్తున్నారు.
స్పీకర్ మారబోతున్నారా..ఎవరికి ఛాన్స్
అందులో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మహిళకు స్పీకర్ గా అవకాశం ఇవ్వటం పైన పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే శాసన మండలికి ఛైర్మన్ గా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తకి.. మైనార్టీ మహిళకు డిప్యూటీ ఛైర్మన్ గా నియమించారు. బీసీ వర్గానికి స్పీకర్ పోస్టు కంటిన్యూ కానుంది. బీసీ మహిళకు ఇవ్వాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లుగా చెబుతున్నారు.
అది కూడా ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ మహిళకే ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో ఎస్టీ వర్గానికి వర్గానికి చెందిన రాజన్నదొర.. సీనియర్ నేతలు ధర్మాన ప్రసాద రావు..ఆనం రామానారాయణ రెడ్డి పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. సీనియర్ నేతలుగా ఉన్న ఆనం కు స్పీకర్ పదవి ఇవ్వటానికి సామీజక సమీకరణాలు అడ్డుగా మారే అవకాశం ఉంది.
బీసీ వర్గానికే స్పీకర్ పదవి కొనసాగింపు
అయితే, ధర్మాన ప్రసాదరావు కు స్పీకర్ పదవి కేటాయించి.. తమ్మినేనికి కేబినెట్ లో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ మూడేళ్ల కాలంలో స్పీకర్ గా తమ్మినేని సమర్ధవంతంగా వ్యవహరించారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. కానీ, మంత్రిగా పని చేయాలనే తమ్మినేని కోరిక మేరకు మార్పు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక, ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ.. సభలోనూ హోరా హోరీగా చర్చలకు అవకాశం ఉంది. ఈ సమయంలో .. సభా నిర్వహణలో స్పీకర్ పాత్ర కీలకం కానుంది. దీంతో..అసలు స్పీకర్ గా మార్చి మరొకరికి అవకాశం ఇస్తారా...లేక, తమ్మినేనికి మరో రెండేళ్ల పాటు పదవిలో కొనసాగిస్తారా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తంగ కేబినెట్ ప్రక్షాళన విషయంలో సీఎం జగన్ తీసుకొనే నిర్ణయాలు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతున్నాయి.