దటీజ్ పవన్ కల్యాణ్: ఉదయం విజ్ఞప్తి.. సాయంత్రానికి రోడ్డు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు మరోసారి తన నిబద్ధతను, మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజా సమస్యల పట్ల ఆయన చూపించే తక్షణ స్పందన, పరిష్కార మార్గాలను అన్వేషించే వేగం అంధ మహిళా క్రికెటర్ల విషయంలో మరోసారి రుజువైంది. డిసెంబర్ 12న తనను కలిసిన ప్రపంచకప్ విజేతలైన క్రీడాకారిణుల విజ్ఞప్తిని ఆలకించి, కేవలం గంటల వ్యవధిలోనే రోడ్ల మంజూరుకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు, వారి కుటుంబాలకు వ్యక్తిగత సాయం అందించారు.
ప్రపంచ విజేతలకు భారీ ప్రోత్సాహకం
డిసెంబర్ 12న ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ మహిళల జట్టు సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని హృదయపూర్వకంగా అభినందించారు. వరల్డ్ కప్ గెలిచిన ఆ జట్టుకు పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత సంపాదన నుంచి రూ. 84 లక్షల భారీ ప్రోత్సాహకాన్ని అందించడం విశేషం. క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు, కోచ్లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు.

మధ్యాహ్నం మాట.. సాయంత్రానికి పాలనా అనుమతులు
అభినందనల సందర్భంగా, జట్టు కెప్టెన్ దీపిక (శ్రీసత్యసాయి జిల్లా) తమ స్వగ్రామమైన తంబలహట్టి తండాకు వెళ్లే రోడ్లు ప్రయాణ యోగ్యంగా లేక తమ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్కు విన్నవించారు. దీపిక విజ్ఞప్తిని విన్న వెంటనే ఉప ముఖ్యమంత్రి చలించిపోయి, అదే రోజు సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా అధికారులు తక్షణమే కదిలి హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్లను పరిశీలించి, యుద్ధప్రాతిపదికన అంచనాలు రూపొందించారు.
మంజూరు వివరాలు:
రూ. 3.2 కోట్లతో హేమవతికి వెళ్లే రహదారి నిర్మాణానికి అనుమతి.
రూ. 3 కోట్లతో గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి అనుమతి.
ఈ రెండు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులను పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అదే సాయంత్రం మంజూరు చేశారు.
24 గంటల్లో కుటుంబాలకు గృహోపకరణాల భరోసా
మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తీవ్రంగా చలించిపోయారు. కెప్టెన్ దీపిక, జట్టు సభ్యురాలు పాంగి కరుణ కుమారి (అల్లూరి సీతారామరాజు జిల్లా) కుటుంబాల దైన్య స్థితిని తెలుసుకుని, వారికి తక్షణ సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే వారి ఇంటికి గృహోపకరణాలు అందాయి. టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్ఈడీ బల్బులు, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేటులు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు అందాయి. ఈ వస్తుసామాగ్రిని తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, వంట్లమామిడి (పాడేరు ఘాట్ రోడ్డు) గిరిజన గ్రామంలో కరుణ కుమారి కుటుంబానికీ జనసేన నాయకులు, యంత్రాంగం స్వయంగా వెళ్లి అందించారు.
దీపిక కుటుంబానికి అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ టి.సి. వరుణ్, ఇతర జనసేన నేతలు ఈ వస్తువులను అందజేయగా.. కరుణ కుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, ఇతర జనసేన నేతలు అందజేశారు.
క్రీడాకారుల కోటాలో నూతన గృహాల నిర్మాణం
వీటితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరింత సుదీర్ఘమైన భరోసా కల్పించారు. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నూతన గృహాల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తన పేషీకి సూచించారు. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక, డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు కూడా సమకూర్చాలని ఆయన నిర్ణయించారు. ఎవరు కష్టం చెప్పుకున్నా మనసు పెట్టి విని, తక్షణ పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసే నాయకుడిగా పవన్ కల్యాణ్ మరోసారి రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.












Click it and Unblock the Notifications