చంద్రాబాబుకు నాకూ మధ్య గ్యాప్.. అందుకే: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
తనకు టీడీపీ తరుపున రాజ్యసభ సీటు ఎలా వచ్చిందో, చంద్రబాబునాయుడికి తనకు మధ్య గ్యాప్ ఎలా వచ్చిందో ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
అమరావతి: టీడీపీ తరపున అప్పట్లో తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం రావడానికి కారణం నందమూరి హరికృష్ణేనని, ఆయన పట్టుబట్టడం వల్లే చంద్రబాబు నాయుడు తనకు ఆ పదవి ఇచ్చారని ప్రముఖ సాహితీవేత్త, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు.
ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'అప్పుడు చంద్రబాబునాయుడు నాకు రాజ్యసభ సీటివ్వలేదు. అయితే మనకి, మన పార్టీకి మంచిదంటూ హరికృష్ణ పట్టుబట్టారు. దీంతో నాకు రాజ్యసభ సీటు వచ్చింది..' అని పేర్కొన్నారు.
ఆ తరువాత కొంతకాలానికి హరికృష్ణకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వమని తాను చంద్రబాబునాయుడిని అడిగానని, అందుకు ఆయన.. 'నీకు తెలియదులే. చాలా ఉన్నాయి. అయినా, హరికృష్ణ నీకు దగ్గరా? నాకు దగ్గరా? మా బావమరిది..' అని అన్నారని యార్లగడ్డ చెప్పారు.
ఆ తరువాత కూడా కొంతసేపు తమ మధ్యన సంభాషణ సాగిందని.. 'నేను హరికృష్ణకు కృతజ్ఞుడిని. ఆయనకు మంత్రి పదవి లేకుండా.. నేను పదవిలో కొనసాగడం మర్యాదగా ఉండదు..' అని తాను చంద్రబాబుతో చెప్పానని లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు.
'మీకు హిందీ వచ్చు, పదిమందితో పరిచయాలు కూడా ఉన్నాయి. రాజ్యసభలో నాయకుడిని చేస్తాను..' అని చంద్రబాబునాయుడు అంటే.. అందుకు తాను 'సార్, మీరు హరికృష్ణను మంత్రిని చేయండి. నేనొచ్చి పార్టీ ఆఫీసు ఊడ్వమన్నా ఊడుస్తా...' అని అన్నానని, ఈ క్రమంలో చంద్రబాబునాయుడుకు, తనకు మధ్య గ్యాప్ వచ్చేసింది' అంటూ యార్లగడ్డ చెప్పుకొచ్చారు.