తిరుమలలో.. వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 11 రోజుల ముందు..!!
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల.. వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది. జనవరి 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
వైకుంఠ ఏకాదశిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టీటీడీ కొన్ని నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులకు తిరుమలకు వెళ్లొచ్చు గానీ శ్రీవారిని దర్శనం చేసుకునే అవకాశం వారికి లభించదు. చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ 10 రోజుల పాటు రద్దవుతాయి.

దీనితో పాటు- శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 30 నుండి జనవరి 23వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని దివ్యప్రబంధ అధ్యయనంగా పిలుస్తారు.
9వ శతాబ్దంలో శ్రీవారి ప్రాశస్త్యాన్ని వివరిస్తూ 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలు ఇవి. వీటిపై శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్ల దివ్యప్రబంధంలోని 4,000 పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
ఈ అధ్యయనోత్సవాల్లోని తొలి 11 రోజులను పగల్పత్తు, మిగిలిన 10 రోజులను రాపత్తుగా వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి శాత్తుమోర నిర్వహిస్తారు. 25వ రోజున అంటే 23వ తేదీన ఈ దివ్యప్రబంధ అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.
ధనుర్మాసం ప్రారంభమైన నేపథ్యంలో నేటి నుంచి స్వామివారికి సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలతో నివేదిన కార్యక్రమాన్ని ఆరంభించారు టీటీడీ అర్చకులు. ఈ సందర్భంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం కూడా పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ధనుర్మాసంలో శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు అర్చకులు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోసె, బెల్లం దోసె, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలతో పూజిస్తారు.












Click it and Unblock the Notifications