ఇకపై బియ్యం వద్దంటే డబ్బులు - మే నెల నుంచి అమలు : ఎంత ఇస్తారంటే..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులు అవసరమైతే బియ్యానికి బదులు నగదు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే నెల నుంచి ఈ విధానం అధికారికంగా అమలు చేసేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. తమకు బియ్యం వద్దు..డబ్బులే తీసుకుంటామని అంగీకరించిన కార్డుదారులుకు బియ్యానికి బదులుగా ప్రతినెలా నగదు పంపిణీ చేయనున్నారు. బియ్యం వద్దనే వారికి ఎంత మొత్తంలో నగదు బదిలీ చేయాలనే అంశం పైన కసరత్తు సాగుతోంది.
రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి..ఆ తరువాత దశల వారీగా రాస్ట్ర వ్యాప్తంగా విస్తరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తొలుత జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, గాజువాక ప్రాంతాలతో పాటు నర్సాపురం, నంద్యాల, కాకినాడలను ఎంపిక చేశారు.
తర్వాత దశలవారీగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ వాహనాల ద్వారా ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇక, ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వాలంటీర్ల ద్వారా లబ్ది దారుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటారు. వీటిని స్థానికంగా ఉన్న వీర్వోలు 23న పరిశీలించనున్నారు. ఆ తరువాత 25న తహసీల్దార్ ఆమోదం తీసుకుంటారు.
బియ్యం వద్దనే లబ్దిదారులకు కిలోరూ రూ. 12 నుంచి రూ.15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. బియ్యానికి బదులు నగదు ఇవ్వడంపై ముందుగా కార్డుదారుల అభిప్రాయం తీసుకుంటారు. లబ్ది దారులు అంగీకరిస్తే వారికి నగదు బదిలీ చస్తారు. రెండు నెలల పాటు నగదు తీసుకున్నా ఆ తర్వాత నెలలో కావాలంటే బియ్యం తీసుకోవచ్చు అనే విధంగా ఆప్షన్ ఇవ్వాలని నిర్ణయించారు.
తొలుత బియ్యం వద్దనే వారికి ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందిస్తున్న తరహాలోనే నగదు ఇవ్వనున్నారు. ఆ తరువాత క్రమేణా నగదు బదిలీ బ్యాంకు ఖాతాలకు చేసే విధంగా పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది. దీని పైన ఈ నెలాఖరులోగా పూర్తి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.