టెన్త్ లో ఏడు పేపర్లే - వరుసగా రెండో ఏడాది : ఏపీ ప్రభుత్వ నిర్ణయం..!!
పదో తరగతి పరీక్షల నిర్వహణ పైన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్దుల పైన మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ఈ ఏడాది సైతం గతంలో అమలు చేసిన విధంగానే పరీక్షా పేపర్ల సంఖ్య ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా ప్రతీ ఏటా పదో తరగతి విద్యార్ధుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు. కానీ, వచ్చే మార్చిలో జరగనున్న 2021-22 విద్యాసంవత్సరపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో నంబర్ 79ను విడుదల చేశారు.
గత ఏడాది ఇదే విధంగా
2020-21లో కూడా టెన్త్ పరీక్షలను నిర్వహించలేక విద్యార్థులను ఆల్పాస్గా పేర్కొన్నప్పటికీ.. వారి పైచదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కులను అనుసరించి గ్రేడ్లు ప్రకటించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఛాయారతన్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు టెన్త్, ఇంటర్ విద్యార్థులకు వారి అంతకు ముందరి తరగతుల్లోని అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది టెన్త్ విద్యార్థులకు ఇలా అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు.
కరోనా కారణంగా ఒత్తిడిలో విద్యార్దులు
కోవిడ్ కారణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది కూడా ఏడు పేపర్లకు కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో టెన్త్ పరీక్షలకు 6 లక్షల మందికి పైగా హాజరుకానున్నారు. కరోనా ఉధృతి కారణంగా 2019-20, 2020-21లో టెన్త్ పబ్లిక్ పరీక్షలను 11 పేపర్లకు బదులు ఏడింటికి కుదించిన సంగతి తెలిసిందే. అయినా పరీక్షలను నిర్వహించలేకపోయారు. 2019-20 విద్యాసంవత్సరంలో విద్యార్థులను ఆల్పాస్గా ప్రకటించి మార్కులు, గ్రేడ్లు లేకుండా ధ్రువపత్రాలు ఇచ్చారు.
Recommended Video
ఇంటర్ పరీక్షా ఫీజు గడువు పెంపు
దీనివల్ల విద్యార్థులు ఆపై తరగతుల్లో చేరేందుకు, కొన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే, ఇప్పటికీ అనేక మంది విద్యార్ధులు..వారి పేరెంట్స్ పాఠశాలలకు రావటానికి వెనుకడుగు వేస్తున్నారు. అదే సమయంలో పరీక్షల గురించి ఆందోళన పెరుగుతోంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత విద్యార్ధుల పైన ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఇదే సమయంలో ఇంటర్ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 23 వరకు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు సర్క్యులర్ జారీచేశారు.