రాజధాని మార్పు ఓ ప్రయోగాత్మక ప్రకటన..! ప్రజల మూడ్ ను బట్టి వ్యూహం మార్చనున్న జగన్..!!
అమరావతి/హైదరాబాద్ : అమరావతి రాజధానిపై ఊహాగానాలు తారా స్థాయిలో నడుస్తున్నాయి. రాజధాని తరలిపోతుందని స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపి ప్రజలందరిలో తెలియని అయోమయం కూడా నెలకొంది. ప్రభుత్వ వర్గాల్లో కొందరు అదికారులు ఏం జరుగుతుందో తెలయని సందిగ్దంలో ఉన్నట్టు తెలుస్తోంది. అదికార వైసీపిలో కొంత మంది నేతలు సైతం మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పట్ల విస్మయానికి గురైనట్టు సమాచారం. ముఖ్యంగా కృష్ణ, గుంటూరు జిల్లాల్లోని నేతలు అమరావతి లో రాజధాని అంశం గురించి ఏంజరుగుతుంది, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారో అర్ధం కాక అచేతనంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
రాజధాని నిర్మాణంపై టెస్టింగ్ స్టేట్మెంట్లు..! ప్రజల పల్స్ తెలుసుకోవడమే జగన్ లక్ష్యం..!!
రాజధాని నిర్మాణానికి అమరావతి సరైన ప్రదేశం కాదనే ప్రకటన మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా చేసారా, లేక సీఎం జగన్ మోహన్ రెడ్డి చేయించారా అనే అంశం పట్ల స్పష్టత కోసం ఏపి నేతలు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న జగన్ తిరిగి వచ్చిన తర్వాత బొత్స చేసిన వ్యాఖ్యల పట్ల ఎలాంటి స్పందన తెలపలేదు. అమరావతి నిర్మాణం జరుగుతుందని గాని, దొనకొండకు తరలి వెళ్తుందని గాని, బొత్స చేసిన వ్యాఖ్యల్లో వాస్తావాలు లేవని గాని ఎలాంటి ప్రకటన జగన్ చేయలేదు. దీంతో అమరావతి ప్రజల్లో అయోమయం, దొనకొండ రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రకాశం జిల్లా రియల్ వ్యాపారులు మాత్రం ఎగిరి గంతేస్తున్నారు.
బొత్స లీకింగ్ ప్రకటన..! ప్రజా వ్యతిరేకతను పరిశీలిస్తున్న ప్రభుత్వం..!!
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోందన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాట రాష్ట్రంలో పెద్ద దుమారానికి దారి తీసింది. రాజధాని అమరావతి కోసం ఎంతో విలువైన తమ భూములు ఇచ్చి, తరువాత తరాల భవిష్యత్తుకు రాజధానిపైనే ఆశలు పెట్టుకున్న ఆ ప్రాంత రైతులు, ప్రజలు, రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఆశలు పెట్టుకున్న వ్యాపారులు, పెట్టుబడిదారులు, అక్కడ భూములు కొనుక్కున్న బడాబాబులు, రాజకీయ నాయకులు దీనిపై ఆందోళన చెందుతుండగా, రాష్ట్ర విభజన తరువాత రాజధాని ఏర్పడే ప్రాంతాన్ని సరిగ్గా అంచనా వేయలేక, వేరే ప్రాంతంలో భూములు కొనుక్కుని నష్టపోయామనుకుంటున్నవారు, దొనకొండ వద్ద భూములు కొన్న నేతలు మాత్రం సంతోషిస్తున్నారు.
ప్రజాకాంక్షను బట్టి రాజధాని నిర్మాణం..! ఎపి సీఎం మదిలో ప్రత్యామ్నాయం..!!
అయితే.. జగన్ ప్రభుత్వం ఇంతకీ నిజంగానే రాజధానిని మార్చబోతుందా? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశ్నలతో పాటే వాటికి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మార్పుపై చర్చలకు ఊతమిచ్చేలా బొత్స చేసిన కామెంట్లకు రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి సుమారు 3 నెలలవుతున్నా జగన్ పాలన ఇంకా గాడిన పడకపోవడం, రాజకీయ కక్ష్య సాధింపులే తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించిన సరైన అడుగులు ఇంకా పడకపోవడం, వరద పరిస్థితులను సరిగ్గా ఎదుర్కోకపోవడం, వంటివన్నీ విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వంపై జనం పెట్టుకున్న ఆశలు మెల్లమెల్లగా కరుగుతున్న సూచనలు కనిపిస్తుండడంతో జనాల దృష్టిని మళ్లించడం కోసం చర్చను రాజధాని మార్పుపైకి తీసుకెళ్లినట్లుగా కూడా మరో చర్చ జరుగుతోంది.
ప్రజలతో పాటు అదికారుల్లో అయోమయం..! రియల్ వ్యాపారుల్లో మాత్రం ఆనందం..!!
అదేసమయంలో రాజధాని విషయంలో అయోమయం సృష్టించి, దాన్ని సొమ్ము చేసుకునే ఉద్దేశాలతోనూ ఈ రకమైన రాజకీయ క్రీడకు తెరలేపినట్టు తెలుస్తోంది. అమరావతిపై అయోమయం సృష్టించి, రాజధాని తరలిపోతుందన్న భయాలతో రియల్ వ్యాపారాన్ని పడగొట్టి తక్కువ ధరలకు వైసీపీ నేతలు భూములు సొంతం చేసుకుని ఆ తరువాత తమ భూములున్న ప్రాంతాల్లో రాజధాని కీలక నిర్మాణాలు, ప్రాజెక్టులు తీసుకొచ్చి లాభపడే దురుద్దేశాలూ ఉండొచ్చన్న విమర్శలు ఏపి వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిజంగానే రాజధాని మార్చాలన్న ఆలోచనతో ఉండి అసలు దానిపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు బొత్స ద్వారా లీక్ చేసి ఉంటారని, ప్రజలు వ్యతిరేకిస్తున్నారా లేక అంగీకరిస్తున్నారా అనే అంశాన్ని దృవీకరించుకున్న తర్వాత అడుగులు వేయాలనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షానికి ప్రజల మద్దతు దొరుకుతుందా అనే అంశం బేరీజు వేసుకుని, దానికి అనుగుణంగా వ్యవహరించేందుకే ఈ వ్యవహారాన్ని తెరమీదకు తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.