దూసుకొస్తున్న తుఫాను, మూడు జిల్లాలకు ముప్పు - తాజా అలర్ట్స్..!!
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి 100-110 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పరిస్థితికి అనుగుణంగా విద్య సంస్థలకు సెలవు ప్రకటించనున్నారు.
తుఫాను ముప్పు
తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం ఉదయానికి తుఫాన్గా బలపడింది. గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ఒడిసాలోని భిటార్కనికా, ధామ్రా సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కి.మీ. వేగంతో అప్పుడప్పుడు 120 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరంలో అలలు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడతాయని ఐఎండీ పేర్కొంది.

ఐఎండీ హెచ్చరిక
ఒడిశా తీర ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, పల్లపు ప్రాంతాలు నీట మునగడంతోపాటు రవాణా, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో తూర్పుకోస్తా, ఆగ్నేయ రైల్వేలు అనేక రైళ్లను రద్దు చేశాయి. తూర్పు మధ్య, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య, ఈశాన్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో చేపల వేటను నిషేధించారు. ఉత్తరాంధ్ర తీరం వెం బడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 26వ తేదీ వర కు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

రైళ్లు రద్దు
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులలో రెండో నంబరు హెచ్చరిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులకు సమాచారం అందించారు. తీవ్ర తుఫాను ఒడిసాలో తీరం దాటుతున్నందున ఏపీకి ముప్పు తగ్గింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేసారు. ఏపీలోని పలు స్టేషన్లలోనూ రైల్వే కంట్రోల్ రూమ్ల ఏర్పాటు అయ్యాయి. 53 రైళ్లను రద్దు చేసారు. అదే విధంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో పలు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలుపుదల చేసారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications