ఇంకా వరదలోనే పలు గ్రామాలు - 30కి చేరిన మృతులు : 18 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు..!!
ఏపీలోని నాలుగు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, వదద మాత్రం పూర్తిగా తగ్గలేదు. రైలు పట్టాల కిందకు నీరు చేరి ఉధృతికి కొట్టుకుపోవడంతో విజయవాడ- నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేశారు. మరో పది రైళ్లను దారి మళ్లించారు. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో 30 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలోనే 17 మంది మృతి చెందగా చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, అనంతపురంలో ఏడుగురు మరణించారు.
కడప జిల్లాలో భారీ నష్టం
వరద ప్రభావిత నాలుగు జిల్లాల్లో 274 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 31,827 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వరదలతో కడప జిల్లాలోనే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. వైఎస్సార్ కడప జిల్లాలో పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోవడంతో సంభవించిన వరదల్లో గల్లంతైన వారికి సంబంధించి 15 మృతదేహాలు లభ్యమైనట్లు కలెక్టర్ విజయరామరాజు ప్రభుత్వానికి నివేదించారు. ఆదివారం సాయంత్రానికి మరికొన్ని మృతదేహాలు బయటపడినట్లు తెలుస్తోంది. కడప- అనంతపురం ప్రధాన రహదారిలో కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించాయి.
తిరుపతిలో రాయల చెరువుకు పొంచి ఉన్న గండం
కడప రాధాకృష్ణనగర్ ప్రాంతంలో పురాతన రెండతస్తుల భవనం ఆదివారం తెల్లవారుజామున కుప్పకూలింది. చిత్తూరు జిల్లావ్యాప్తంగా వరదల ఉదృతికి 8 మంది మృతి చెందారు. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయులు 500 ఏళ్ల క్రితం నిర్మించిన రాయల చెరువుకు లీకేజ్ కారణంగా నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం జిల్లాలో నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో వాగులు, వంకలు పోటెత్తాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది పొటెత్తడంతో పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
రైళ్ల రద్దు - దారి మళ్లింపు
నెల్లూరు సమీపంలోని చెన్నై-కోల్కతా ఏషియన్ హైవే-16 జాతీయ రహదారికి శనివారం అర్ధరాత్రి పలుచోట్ల గండ్లుపడ్డాయి. పెన్నా వరద ఉధృతికి హైవే కొట్టుకుపోయి శనివారం అర్ధరాత్రి నుంచి ఇరువైపులా సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. పడుగుపాడు వద్ద పెన్నా వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కింద కంకర, మట్టి కొట్టుకుపోవడంతో పట్టాలు నీటి ఉధృతిలో వేలాడుతున్నాయి. దీంతో విజయవాడ- నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు రైళ్లను తాత్కాలికంగా నిలిపివేశారు. మరో పది రైళ్లను దారి మళ్లించారు.
Recommended Video
ఉచిత సరుకుల పంపిణీ
నెల్లూరు వెంకటేశ్వరపురం సాలుచింతల వద్ద పాలిటెక్నిక్ విద్యార్థి గోపి వరద నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. కాగా, సోమశిల జలాశయం వెలుపలి వైపు రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రేపటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. అధికారులకు ప్రభావిత గ్రామాల ప్రజలను శిబిరాలకు తరలించారు. వరద ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం నిత్యావసరాలు ఉచితంగా అందించాలని కలెక్టర్లను ఆదేశించింది.