కేంద్రం పై అలుపెరగని పోరాటం..! మళ్లీ ఢిల్లీకి చంద్రబాబు..!!
హైదరాబాద్: కాషాయ పార్టీ నుండి నుంచి దేశాన్ని రక్షించాలని, ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాలని ఏపి సీయం చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయం తీపుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి జాతీయ స్థాయిలో మద్దత్తు లభిస్తుండంతో చంద్రబాబు మరింత ఉత్సాహంగా కార్యచరణ రూపొందించుకుంటున్నారు. ఇదే ఊపులో మరిన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా ఏకం చేయాలని భావిస్తున్నారు. అందుకే మరోసారి ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నారు. దేశ రాజధానిలో చంద్రబాబు బీజేపియేతర వ్యూహాలకు పదును పెడుతుంటే కాషాయ దళాలు ఎలాంటి ప్రతివ్యూహంతో ఎదురుదాడికి దిగుతారో అనే అంశం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
మోదీ వర్సెస్ చంద్రబాబు..! మళ్లీ ఢిల్లీ కి పయణమైన బాబు..!!
ఓ వైపు హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై దుమారం, మరో వైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపడంపైనే ప్రస్తుతం ఆయన ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
జాతీయ నేతలతో బాబు మంతనాలు..! టార్గెట్ మోదీ సర్కార్..!!
చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన వెంటనే మళ్లీ ఆగమేఘాల మీద మరోసారి హస్తినకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం ఢిల్లీలో పర్యటించేందుకు ప్రణాళిక ఖరారు చేసుకున్నారు కూడా. గత శనివారం ఢిల్లీలో జాతీయ మీడియా సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు ఏకిపారేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, దిల్లీ ముఖ్యమంత్రి - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, లోక్తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితర ప్రతిపక్ష నేతలతో సమావేశమయ్యారు.
రాష్ట్రాల పట్ల కేంద్ర వివక్షతను ఎండగట్టాలి..! అందుకే బాబు జాతీయ స్థాయి మంతనాలు..!
జాతీయ రాజకీయాలపై దేశ నేదలతో చంద్రబాబు లోతుగా చర్చించారు. బీజేపీని గద్దె దించేందుకు తాత్కాలిక ప్రయోజనాలను పక్కన పెడదామంటూ వారికి పిలుపునిచ్చారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా కేంద్రంలో ఐక్య కూటమి ఏర్పాటుకు ఆయా నేతల మద్దత్తును చంద్రబాబు కూడబెట్టగలిగారు. ఇకపై తాను జాతీయ రాజకీయాలపై మరింతగా దృష్టి పెడతానని, అవసరమైతే వారానికి 3 రోజులు వాటికే కేటాయిస్తానని చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో వెల్లడించారు. ఇక తరచుగా ఢిల్లీ వస్తానని కూడా చెప్పారు.
బాబుకు జాతీయ నేతల మద్దత్తు..! వెన్నుదన్నుగా నిలుస్థామని హామీ..!!
కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే తన ప్రధాన అజెండా అని చంద్రబాబు స్వయంగా చాటిచెప్పారు. చెప్పినట్లే కనీసం వారం రోజులు కూడా గడవకముందే చంద్రబాబు మరోసారి హస్తినకు వెళ్తున్నారు. ఈ దఫా పర్యటనలోనూ ఆయన పలువురు కీలక నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. మోదీ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో తాను తమతో కలిసి వస్తానని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మంగళవారం చంద్రబాబుకు ఫోన్ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక చంద్రబాబు ఎండీయే ప్రభుత్వం పై చేస్తున్న పోరాటం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.