మహిషాసురమర్థినీదేవిగా అభయం - అనుగ్రహం కోసం ఇలా చేయండి..!!
ఇంద్రకీలాద్రిపై తొమ్మిదో రోజు శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ మహిషాసుర మర్దినిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహర్నవమి నాడు అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజంతా సాఫీగా దర్శనాలు సాగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మహాశక్తి స్వరూపంగా
శక్తిపీఠాలలో ఒకటిగా విజయవాడ కనకదుర్గాదేవి ఆలయానికి పేరు. దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ బెజవాడ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇవాళ మహిషాసుర మర్దినిదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం ఇదే. సింహవాహనాన్ని అధిష్ఠించి, అష్ట భుజాలతో... ఆయుధాలను ధరించి, సకల దేవతల అంశలతో... మహాశక్తి స్వరూపంగా ఆమె దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని పూజిస్తే సర్వ దేవతా అనుగ్రహం కలుగుతుందంటారు.

ఇలా పూజించండి
మహిషాసురమర్దని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయనీ, సకల దోషాలు నివృత్తి అవుతాయనీ, శత్రువులపైనా, సర్వకార్యాల్లోనూ విజయం సిద్ధిస్తుందనీ భక్తుల విశ్వాసం. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు అన్నం, పులిహోర, గారెలు, పాయసం, అప్పాలు సమర్పించాలని పండితులు సూచిస్తున్నారు. అలంకరించే చీర రంగు గోధుమ, ఎరుపులో ఉంటుంది. అర్చించే పూలు తామర పుష్పాలుగా వెల్లడించారు. శ్రీ మహిషాసురమర్దినీ స్తోత్రం పారాయణ చేయాలని పండితులు పేర్కొన్నారు.
పెరిగిన రద్దీ
ఇక..భక్తుల రద్దీ పెరుగుతున్న వేళ ఆలయ అధికారులు అప్రమత్తం అయ్యారు. సామాన్య భక్తులకు దర్శనం కోసం ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 18 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. నదీ స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు. కృష్ణానది పవిత్ర హారతుల దృష్ట్యా దుర్గా ఘాట్ వద్దకు భక్తులను అనుమతించడం లేదు. చివరి రోజున నిర్వహించే తెప్పోత్సవం పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications