ఎపి:ప్రభుత్వం చేతికే...ఆ రూ. 300 కోట్ల విలువైన భూములు
అమరావతి:జమిందారీ భూములపై కేసులకు సంబంధించి ఎపి ప్రభుత్వానికి సెటిల్మెంట్ కమిషనర్ నుంచి అనుకూలంగా నిర్ణయం వెలువడింది. దీంతో సుదీర్ఘకాలంగా ఈ విషయమై పోరాటం చేస్తున్న ఎపి ప్రభుత్వానికి ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. కృష్ణా,చిత్తూరు జిల్లాల్లో అత్యంత వివాదాస్పదమైన రెండు భూములకు సంబంధించి వెలువడిన తుది నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి భారీగా ప్రయోజనం చేకూరనుంది.
వందల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించిన రెండు కేసుల్లోనూ సెటిల్మెంట్ కమిషనర్ ప్రభుత్వానికే అనుకూలంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో సహా అన్ని రకాల వ్యవహారాలను తోసిరాజని మల్లవల్లి భూములు ప్రభుత్వం చేజారిపోకుండా కాపాడారు. ఈ రెండు తీర్పులతోనే రూ.300 కోట్ల విలువ చేసే సుమారు 1000 ఎకరాల భూములు ప్రభుత్వానికి దక్కాయి.
రెండు భూములు...తుది తీర్పు
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా వివాదంలో ఉన్న కృష్ణా జిల్లా మల్లవల్లి 78 ఎకరాలతోపాటు చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కంగుంది అటవీ భూములు 959 ఎకరాలూ రక్షిత అటవీ భూమిగా సెటిల్మెంట్ కమిషనర్ తుది తీర్పునిచ్చారు. దీంతో ఇన్చార్జి సర్వే సెటిల్మెంట్ కమిషనర్ జగన్నాథంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భూముల వివాదం 2013లో సెటిల్ మెంట్ కమీషనర్ వద్దకు వెళ్లగా దీనిపై ఆయన నుంచి తాజాగా తుది తీర్పు వెలువడింది. అలాగే 50 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న చిత్తూరు జిల్లాలోని వందలాది ఎకరాల వివాదాస్పద భూమిపై కూడా తాజాగా తుది తీర్పు వెలువడటం గమనార్హం.
మల్లవల్లి భూములు...వివరం
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో 37.25 ఎకరాల భూమిపై వివాదం ఉంది. జమిందారి భూమి అయిన వీటిపై తమకు హక్కులు ఉన్నాయని, రైత్వారీ పట్టాలు జారీ చేయాలని కొందరు పిటిషన్లు వేశారు. మల్లివల్లిలో ఎకరం భూమి రూ.10 కోట్ల పైమాటే. ప్రైవేటు వ్యక్తులు జాయింట్ కలెక్టర్ కోర్టులో తొలుత పిటిషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. అది పూర్తిగా అటవీ పోరంబోకు అని తేల్చారు. 2013లో సెటిల్మెంట్ కమిషనర్ వద్ద అప్పీల్ చేశారు. ఈ కేసును చివరిసారిగా 2016, ఆగస్టు 27న విచారించారు. ఆ తరువాత సర్వే సెటిల్మెంట్కు ఇన్చార్జి కమిషనర్గా ఫిబ్రవరిలో బాధ్యత చేపట్టిన జగన్నాథం సమగ్ర విచారణ తర్వాత అప్పీల్ పిటీషన్ను కొట్టివేశారు.
మరోవైపు...చిత్తూరు జిల్లాలో
మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుందిలో 78 ఎకరాల భూమిపై 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. అది జమిందారి భూమి అని కొందరు వ్యక్తులు పోరాడుతుండగా...అది రక్షిత అటవీ భూమి అని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదంపై 1982లో నెల్లూరు సెటిల్మెంట్ కమిషనర్ ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే ప్రభుత్వం పట్టుదలతో ఆ కేసు అనేక మలుపులు తిరుగుతూ న్యాయస్థానానికి వెళ్లి...మళ్లీ చివరకు సెటిల్మెంట్ కోర్టుకే చేరింది. తాజాగా ఈ కేసును విచారించిన సెటిల్మెంట్ కమిషనర్ 78 ఎకరాల వివాదాస్పద భూమితో పాటు 959.34 ఎకరాలూ అటవీ పోరంబోకు అని తేల్చేశారు.
తారాస్థాయిలో...ఒత్తిడులు
కోట్లాది రూపాయల విలువైన ఈ భూములను దక్కించుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ సెటిల్మెంట్ కమిషనర్ పై తారాస్థాయిలో అనేక రూపాల్లో ఒత్తిడులు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ భూమి తమదేనంటూ తమ అధీనంలోనే ఉందని పిటిషనర్లు ఒక్క ఆధారమూ చూపించలేకపోయారని... అలాగే 2009లో జరిగిన ప్రత్యేక సర్వేలోనూ వీరు ఎలాంటి వివరాలను పొందుపరచలేదని సెటిల్మెంట్ కమిషనర్ తేల్చారు. అటవీ భూములను కాపాడాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును సెటిల్ చేసినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వానికి ఒక్కసారిగా భారీ స్థాయిలో భూములు సమకూరగా మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే మల్లవల్లిలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలువడటంతో ఒక పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం చర్యలు వేగం పుంజుకోనున్నాయి.