ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు- కారణాలు చెప్పండి : కేంద్రానికి హైకోర్టు ఆదేశం..!!
ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని.. దీనికి గల కారణాలను కోర్టు ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నప్పుడు.. రాష్ట్రానికి ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
హోదా ఇస్తామని చెప్పి అమలు చేయలేదు
విచారణను డిసెంబరు 20కి వాయిదా వేసింది. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి... ఆ హామీని అమలు చేయట్లేదంటూ అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేశ్చంద్ర వర్మ హైకోర్టులో పిల్ వేశారు. న్యాయవాది ఎం.రామారావు వాదనలు వినిపిస్తూ.. ఏపీని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని పార్లమెంటులో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారు. కానీ, ఏపీకి ఇచ్చిన హామీని మాత్రం అమలు చేయలేదని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు ఇచ్చి ఏపీకి ఎందుకు ఇవ్వరు
పలు రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీ విషయంలో ఎందుకు ఇవ్వట్లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. విభజనతో ఏపీ నష్టపోయిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏఎస్జీ హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కు భౌగోళిక పరిస్థితుల విషయంలో తేడా ఉందన్నారు. ఆ వాదనలను విన్న ధర్మాసనం.. కౌంటరు వేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఇదే అంశం రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారింది.
Recommended Video
సుప్రీం కోర్టులో వ్యాజ్యాలు పెండింగ్
తాజాగా తిరుపతిలో సదరన్ రీజనల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ సైతం కేంద్రం హోం మంత్రి అమిత్ షా కు ఏపీకి హోదా ఇవ్వాలని కోరారు. ఇప్పుడు న్యాయ పరంగానూ కేంద్రం దీని పైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా ఏపీకి హోదా స్థానంలో ఆ మేర ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్రం చెబుతున్నా..ఆ దిశగానూ ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. 2019 లో అటు కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదు. ఇక, ఇప్పుడు హైకోర్టులో కేంద్రం తన కౌంటర్ లో ఎటువంటి సమాధానం ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.