రుణాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు -గవర్నర్ పేరు ఎలా వాడుతారు : ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్డీసీ) ద్వారా రుణాలు పొందుతున్న వ్యవహారం పైన దాఖలైన వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఢీసీ ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందులో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరు ఎలా చేరుస్తారని ప్రశ్నించింది.

రుణాల చెల్లింపులో విఫలమైతే..
రూ 25 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని న్యాయస్థానం ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్పై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ ఒప్పందం ద్వారా గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని పేర్కొంది. అలాగే... ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్కు జమ చేయకుండా నేరుగా ఏపీఎస్డీసీకి ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించింది.

డాక్యుమెంట్లు సమర్పించాలంటూ
నిధుల బదిలీకి సంబంధించి ఒరిజనల్ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటీషన్ల పైన విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్ లో జయ చేయకుండా నేరుగా ఎస్డీసీ కి జమ చేస్తున్నామనే వాదనలో నిజం లేదని వివరించారు. ఎస్డీసీ ఏర్పాటు రాజ్యాంగ, చట్ట విరుద్ధం కాదని కేవలం పిటిషనర్ రాజకీయ దురుద్దేశాలతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని ఏజీ తెలిపారు. పిటిషనర్లు టీడీపీ వ్యక్తులని... రాజకీయ విమర్శల కోసమే ఈ పిల్ దాఖలు చేశారని వివరిస్తూ... కొట్టివేయండని కోరారు.

రుణాలకు బాధ్యత ఎవరిది..
వాదనల్లో భాగంగా..ప్రభుత్వం వివిధ మార్గాల్లో తెచ్చుకుంటున్న లక్షల కోట్ల అప్పులకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తరఫున గ్యారెంటీ పత్రాలపై ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారే ఈ సంతకాలు పెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.25,000 కోట్ల రుణానికి కూడా ఈయనే సంతకం పెట్టారు. ఇప్పుడేమో ఆ రుణానికి, గవర్నర్కూ సంబంధం లేదని హైకోర్టులో ఏజీ చెప్పారు. మరి... బ్యాంకులు ఆ అప్పులను ఎవరిని అడగాలంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.