ఎపిలో రాజ్యసభ ఎన్నికలు చిచ్చుపెట్టనున్నయా?...ఏం జరగబోతోందనేది అందరిలో టెన్షనే!
అమరావతి: గెలుపు వ్యూహాలు అనుసరించడంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యి...అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈసారి జరగనున్నరాజ్యసభ ఎన్నికలు ఈ రాజకీయ చాణుక్యుడికి విచిత్ర పరిస్థితిని తీసుకొచ్చాయి.
ఎపిలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టిడిపికి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఏ మాత్రం లేకపోయినా...తమకు గ్యారెంటీగా దక్కే రెండు సీట్లతో పాటు...కావాలంటే మూడో సీటును కూడా తన చాతుర్యం ద్వారా దక్కించుకోగలిగిన చంద్రబాబు...ఈసారి మాత్రం ఈ గెలుపు గురించి బాగా ఆలోచిస్తున్నారట...అయితే ఈ ఆలోచన మూడో సీటు గెలవగలమా?...లేదా?...అని కాదట... అసలు గెలుద్దామా?...వద్దా?... అనట..అదేంటి...షాక్ అయ్యారా?...మరదే!...ఈ ఎన్నికల విశేషం...ఈసారి రాజకీయ పరిస్థితులు అంత విచిత్రంగా వచ్చాయి...వివరాల్లోకి వెళితే...

రాజ్య సభ సీటు...విలువ చాలా ఎక్కువే!
దేశ రాజకీయాల్లో ఒక రాజ్యసభ సీటుకు ఉండే విలువపై సామాన్య జనానికి అంతగా తెలియకపోయినా...రాజకీయ నాయకులకు...వివిధ రంగాల ప్రముఖులకు... పారిశ్రామికవేత్తలకు బాగా తెలుసు. దేశంలోని అత్యుత్తమ చట్ట సభ పార్లమెంట్ లోకి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రవేశించలేనివారు ఈ రాజ్య సభ సీటు ద్వారానే ఆ అవకాశాన్ని పొందుకోగలుగుతారు. అలా ప్రవేశించే అవకాశం దేశంలోని వివిధ రంగాల దిగ్గజాలకు మాత్రమే లభించే అరుదైన అవకాశం...అందుకే ఈ సీటు కోసం పోటీ తక్కువేమీ కాదు...ప్రజలు ఆయా రంగాలకు సంబంధించి దేవుళ్లుగా భావించే లబ్దప్రతిష్టులు కూడా ఈ రాజ్యసభ సీటు కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఇక ఈ సీటు దక్కుతుందంటే వంద కోట్లయినా అవలీలగా ఖర్చుపెట్టే వ్యాపార,వాణిజ్య,పారిశ్రామికవేత్తలకు కొదువే లేదంటేనే ఈ సీటు విలువేంటో అర్ధం చేసుకోవచ్చు.

అలాంటి సీటు...ఈ సారి బాబును ఊరిస్తోంది...
అంతటి విలువైన రాజ్యసభ ఎంపీ సీటు టిడిపి అధినేత చంద్రబాబును ఈసారి బాగా ఊరిస్తోంది...అయితే అది గెలుపోటములకు సంబంధించిన ఊరింపు కాకపోవడమే విచిత్రం...అసలు ప్రయత్నించాలా? వద్దా? అనే ఆలోచనే చంద్రబాబు ఒకటికి వందసార్లు ఆలోచించాల్సి వస్తోంది...ప్రయత్నిస్తే గెలుపు దక్కచ్చు...ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మూడో రాజ్య సభ సీటు గెలుపు కోసం చేసే ప్రయత్నాలు...ఆ తరువాత ఏ పరిణామాలకు దారితీస్తాయో నని ఆందోళన...తల్చుకుంటే గెలిచే అవకాశాలు...కానీ గెలిస్తే ఒక తంటా?...వదిలేద్దామంటే ఒక విలువైన సీటు దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్...చూస్తూ చూస్తూ వదిలేయడం చంద్ర బాబు లాంటి రాజకీయ యోధుడికి చాలా కష్టం.

ఎపిలో...పార్టీల బలాబలాలు...
రాష్ట్రంలోని మొత్తం 175 ఎంఎల్ఏల్లో టిడిపికి 103 మంది ఉన్నారు. ఒక రాజ్యసభ స్ధానం గెల్చుకునేందుకు 44 ఓట్లు అవసరం. దాని ప్రకారం టిడిపికి ఉన్న బలాన్ని చూస్తే 88 ఎంఎల్ఏలకు 2 సీట్లు వచ్చేస్తాయి. పైగా ఆ రెండు సీట్లకు పోను ఇంకా 15 టిడిపి ఎంఎల్ఏల ఓట్లు మిగిలిపోతాయి. మరోవైపు వైసిపి తరపున గెలిచిన 67 మంది ఎంఎల్ఏల్లో 22 మంది పార్టీ ఫిరాయించారు. దీంతో ఆ పార్టీ ప్రస్తుత బలం 45 మంది అనుకోవచ్చు...దీంతో ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కు కంటే ఒకటి ఎక్కువ అయిన ఆ ఎంఎల్ఏలతో వైసిపికి ఒక రాజ్య సభ స్ధానం దక్కుతుంది. అయితే...ఇక్కడే...టిడిపికి ఆ మూడో సీటు విషయమై ఆశ కలుగుతోంది. రెండు సీట్ల కోసం 88 మంది ఎంఎల్ఏల ఓట్లు పోను ఇంకా మిగిలివున్న15 ఓట్లు, మిత్రపక్షం బిజెపివి 4, ఇండిపెండెంట్లు 2, 22 మంది ఫిరాయింపు ఎంఎల్ఏలు కలిపి ఎంఎల్ఏల సంఖ్యా బలం 43కి చేరుతోంది. సో...రాజ్య సభ మూడో స్ధానాన్ని కూడా టిడిపి దక్కించుకోవాలంటే అదనంగా ఒక్క ఓటు తెచ్చుకోగలిగితే చాలు. అంటే..ఆ ఒక్క ఓటు తెచ్చుకోవాలంటే మళ్ళీ ఫిరాయింపులకు ప్రయత్నించాలి...ఇది ఒక అంశమైతే...ప్రస్తుతం మాటల యుద్దం చేసుకుంటున్న టిడిపి-బిజెపి ఈ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో ఏం చెయ్యనున్నాయనేది మరో ఆసక్తికర అంశం.

బిజెపి ఏం చేస్తుంది?...టిడిపి ఏం చెయ్యబోతోంది?...
అయితే ఎపిలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే టిడిపి-బిజెపిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. మరలాంటి పరిస్థితుల నేపథ్యంలో వస్తున్న ఈ రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి మూడో సీటుకు పోటీ పెట్టకుంటే బిజెపితో సమస్యే లేదు. కానీ ఆ సీటు వదులుకోవడం ఇష్టం లేక బాబు పోటీ పెడితే అప్పుడు బిజెపి ఏం చేస్తుంది...మాటలు మాటలే...ఎంతైనా తమ మిత్ర పక్షం అని టిడిపికి మద్దతు ఇస్తుందా?...అలా ఇస్తే...మరి అదనంగా అవసరమైన ఒక ఎమ్మెల్యే మద్దతును సంపాదించేందుకు టిడిపి చేసే ఫిరాయింపు రాజకీయానికి తాము కూడా సహకరించినట్లే అవుతుంది కదా?...గతంలో పరిస్థితికి పూర్తి భిన్నమైన ఈ పరిస్థితుల్లో అలాంటి పని చేస్తుందా?...మరోవైపు టిడిపి విషయానికొస్తే మూడో సీటు కోసం పోటీలోకి దిగితే మరి బిజెపిని మాటవరసకైనా మద్దతు
అడగక తప్పని స్థితి...మరి అలా ఇప్పుడు అడగగలరా? అడిగితే అందుకు బిజెపి నుంచి వచ్చే జవాబు భిన్నంగా ఉంటే...ఏం చెయ్యాలి?...రాజ్య సభ ఎన్నిక మార్చి 23 తేదీన...కానీ ఇప్పుడే టిడిపి-బిజెపిల మధ్య మాటల యుద్దం రోజురోజుకీ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో మార్చి 23లోపు ఏం జరుగుతుందో ఊహించే అవకాశం లేదు.

ఈ లోపే...పార్లమెంట్ సమావేశాలు...సంక్లిష్టం
బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాజ్య సభకు మూడో అభ్యర్థిని నిలబెడితే టిడిపికి బీజేపీ మద్దతు అవసరం. అయితే గత రాజ్యసభ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటును బీజేపీకి చెందిన ప్రస్తుత కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు ఇచ్చారు కాబట్టి ఈసారి తమకు మద్దతివ్వాలని టీడీపీ కోరే అవకాశముంది...ఇంతవరకు ఒకే...అయితే మరోవైపు చూస్తే మార్చి 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఎపికి జరిగిన అన్యాయంపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సభను స్థంభింప చేయాలని, కేంద్రమంత్రులు ఇద్దరూ రాజీనామా చేయాలని, అవసరమైతే అవిశ్వాస తీర్మానానికైనా రెడీ అని దశల వారీగా ఒత్తిడికి ప్రణాళిక రూపొందించుకుందని అంటున్నారు. మరి అలా చేస్తే ఆ తరువాత వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో మూడో సీటుకు మద్దతు అడిగే అవకాశం ఉంటుందా?...అడిగినా బిజెపి సానుకూలంగా స్పందిస్తుందా?...డౌటే!

మూడో సీటు కోసం...టిడిపి ప్రయత్నమేనంట...
అయితే ఏదేమైనా చంద్రబాబు ఆ మూడో రాజ్య సభ సీటు దక్కించుకోవాలనే అంతిమంగా ప్రయత్నించే అవకాశం ఉందంటున్నారు. అవసరమైతే ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు బిజెపి విషయంలో తెగేదాకా లాగకూడదనే అనుకుంటున్నారట. అందుకే బిజెపి నేతలపై వ్యక్తిగత విమర్శలకు పోవద్దు అని తమ పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారట...సోమూ వీర్రాజుపై ఆల్రెడీ అలాంటి విమర్శలు మొదలైపోయిన నేపథ్యంలో అలాంటి విమర్శలకు దిగితే...వారు రెచ్చిపోయి ఏవేవే వ్యవహారాలను తవ్వితీస్తే అది ఈ రెండు పార్టీల సంబంధాలను త్వరగా దెబ్బతీయడంతో పాటు రాజ్య సభ సీటు అవకాశాన్ని చేజారుస్తాయని చంద్రబాబు ఆలోచించి...ఈ రాజ్య సభ ఎన్నికలు అయిపోయే వరకైనా కొంత ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోకూడదని భావిస్తున్నారట. మరోవైపు ఆ మూడో రాజ్య సభ సీటు
కోసం ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే బాధ్యతను ఒక తెలంగాణా నేతకు అప్పగించారని, ఆ నేత ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయానికి రావడం కూడా జరిగిందని అంటున్నారు...అయితే ఈ మూడో రాజ్యసభ ఎంపీ సీటును గెలవడం కాదు గానీ...గెలిస్తే ఆ తరువాత పరిణామాలు ఎలా దారితీస్తాయోననే ఆందోళనే చంద్రబాబును ఎక్కువ ఆలోచించేలా చేస్తోందట. కాబట్టి ఎపీలో ఈ రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తలెత్తే పరిణామాలే చాల కీలకం కానుండటంతో ఈ మూడు పార్టీల్లో చాలా టెన్షన్ కనిపిస్తోందట.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications