మహా ఉద్యమంగా మారుతున్న ఉపాధ్యాయుల ధర్నా
విజయవాడ : విజయవాడ ధర్నా చౌక్ లో తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న ధర్నా మహా ధర్నాగా కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
అయితే ఉపాధ్యాయుల భారీ ఆందోళన నేపథ్యంలో ఇక్కడ అడుగడుగునా పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఆందోళనల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది ఉపాధ్యాయులు అరెస్టు అయ్యారు. టోల్ గేట్లు, రైల్వేస్టేషన్లు , బస్టాండ్లులో పోలీసుల నిఘా పెరిగింది. ప్రభుత్వం ఎంత అణచివేసినా పోరాటం ఆగదని ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత అరికట్టాలని, 398 రూపాయల జీతంతో పనిచేసే ఉపాధ్యాయులకు న్యాయం చేయాలనేవి తమ ప్రధాన డిమాండ్లుగా వారు పేర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పదిహేనేళ్లుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించాలంటున్నారు. 2014 లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తమ ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు పిడిఎఫ్ ఎంఎల్సీ లు బొడ్డు నాగేశ్వరరావు ,కత్తి నరసింహా రెడ్డి లు మద్దతు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల17 నుంచి ఆమరణ దీక్ష చేపడతామని వారు వెల్లడించారు. ఉపాధ్యాయుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.