రాత్రికి రాత్రే పేరు మార్చారు!! గడప గడపకు ప్రభుత్వం!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి ఏడాది పాటు గడప గడపకు వైసీపీ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ పేరుతో ఇంటింటికీ వెళితే ప్రజల నుంచి తిరుగుబాటు జరుగుతుందని, వ్యతిరేకతను ఎదుర్కోవడం కష్టమని భావించి రాత్రికి రాత్రే కార్యక్రమం పేరు మార్చేశారు. గడప గడపకు వైసీపీ కాకుండా గడప గడపకు ప్రభుత్వం అని పెట్టారు. ప్రభుత్వమైతే ప్రజలు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయరనే ఆలోచన చేశారు ప్రభుత్వ పెద్దలు.
మంత్రుల నుంచి గ్రామస్థాయి వార్డు సభ్యుల వరకు అందరూ పాల్గొనే ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు అధికారులు కూడా ఉంటారు. ప్రజలెవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారని, దీనివల్ల మరో ప్రాంతంలో ఎవరూ గట్టిగా ప్రశ్నించకుండా ఉంటారనేది ప్రభుత్వం ఆలోచనగా ఉందంటూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలవుతోంది. ఈ మూడు సంవత్సరాల నుంచి ఏం పనులు చేశారని ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలా? అని పార్టీ నేతలు మథనపడుతున్నారు. ప్రభుత్వం తరఫున పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. వీరిలో పార్టీనేతలే ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా ఈ కార్యక్రమం పట్ల ఆసక్తి చూపడంలేదు.
ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్నవారు చాలామంది ఉన్నారని, వారి నుంచి ఎటువంటి వ్యతిరేకత రాదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. కరోనా సమయంలో ప్రభుత్వం అప్పులు చేసి మరీ మీ ఖాతాల్లో డబ్బులు వేసిందని చెప్పి వారిని ఓటుబ్యాంకుగా మార్చుకునే ఉద్దేశమే ఈ కార్యక్రమమని తెలుగుదేశం పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలంటే దానికి చాలా నిబంధనలుంటాయి. అధికార పార్టీ నేతలెవరూ పాల్గొనకూడదు. ప్రభుత్వం తరఫువారే పాల్గొనాలి. కానీ ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధికారులు కలిసి పాల్గొంటున్నారు. ఇది గడప గడపకు ప్రభుత్వం కాదని, గడప గడపకు ప్రచారమని, అధికార పార్టీ కుయుక్తులు తెలుసుకొని ఇంటికి వచ్చినవారిని తీవ్రంగా నిలదీయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications