బిసిలకు అన్యాయం పేరుతో వైసీపీ కొత్త కుట్ర,ఒకాయన చిత్రం:చంద్రబాబు
అమరావతి:ప్రతిపక్ష పార్టీ వైసీపీ అన్ని కుట్రలు అయిపోయాక తాజాగా మరో కొత్త కుట్ర మొదలుపెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసిలకు అన్యాయం పేరుతో ఈ కుట్రకు తెరతీసిందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
చంద్రబాబు తాను గత ఎన్నికలకు ముందు చేపట్టిన "వస్తున్నా మీకోసం" పాదయాత్ర కార్యక్రమం పూర్తయి ఐదేళ్లయిన సందర్భంగా శుక్రవారం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. బీసీ న్యాయమూర్తులు...హైకోర్టు జడ్జీలు కాకుండా తాను అడ్డుకున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై చంద్రంబాబు తీవ్రంగా స్పందించారు.
చిత్రం ఇదే...ఒకాయన
బిసి న్యాయమూర్తులు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏకంగా తొమ్మిది మంది హైకోర్టు జడ్జిలుగా నియమితులయ్యారని చంద్రబాబు వెల్లడించారు. చిత్రం ఏమిటంటే అలా న్యాయమూర్తిగా నియమించబడిన ఒక వ్యక్తే...ఆయన పదవీకాలం పూర్తయిపోగానే ఇప్పుడు టిడిపిని విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అసలు బీసీల పట్ల కక్ష్యతో వ్యవహరించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన బిసిలను కసితో అణచి వేశారని చంద్రబాబు ఆరోపించారు.
బిసిలకు...టిడిపి అండ ఇలా
వైఎస్ తన ఐదేళ్ల పాలనలో బీసీ సంక్షేమం కోసం కేవలం రూ.3 వేల కోట్లే ఖర్చు చేశారని, అది కూడా 23 జిల్లాలతో కలసి ఉన్న ఆనాటి సమైక్యాంధ్రకు కలిపి చేసిన ఖర్చు అదని గుర్తు చేశారు. అయితే టిడిపి మాత్రం గడచిన ఈ నాలుగేళ్లలోనే 13 జిల్లాలకే రూ.41 వేల కోట్లు బీసీ ఉప ప్రణాళిక కోసం కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో సభ్యులుగా ఓసీలకు 9 కి బీసీలను విసిలుగా నియమించామన్నారు. అంతేకాదు టిడిపి ప్రభుత్వంలోని 8 కీలకమైన శాఖలకు బీసీలే మంత్రులుగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో...చిచ్చుకు కుట్ర
ప్రతిపక్ష నేత జగన్ వందలకోట్లు డబ్బులిచ్చి ప్రశాంత్ కిశోర్ అనే వ్యక్తిని తనకు సలహాదారుగా తెచ్చుకున్నారు. ఆయనేమో రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని సలహాలు ఇస్తున్నాడు. వైసీపీకి కూడా మొదటి నుంచీ అదే అలవాటని చంద్రబాబు ఆరోపించారు. బీజేపీ-వైసీపీలు కలిసి రాష్ట్రంపై కుట్ర పన్నుతున్నాయంటే తాము గత కొంతకాలంగా చెబుతున్నదే నిజమవుతోందన్నారు. ఇక కేంద్ర మంత్రి అథవాలే వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించడం ఆ కుట్రలో భాగమేనని చెప్పారు. ప్రతిపక్షనేత జగన్ ఎప్పుడెప్పుడు కలిసిపోదామా...ఎప్పుడెప్పుడు కేసులు మాఫీ చేసుకుందామా అని చాలా ఆరాటపడుతున్నారని, నాలుగు రోజులు కూడా ఆగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
బిజెపి-వైసిపి...కలసి పోటీ చేస్తారు
రేపో, మాపో వీళ్లంతా కలిసి పోటీ చేసినా చేస్తారని, నీతిని గురించి మాట్లాడే బీజేపీ అవినీతిపరులతో ఎందుకు భాగస్వామి అయ్యిందని, రాష్ట్రపతి ఎన్నికల్లో వారి మద్దతు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు తెలుగుదేశాన్ని వదులుకున్నారు, ఎందుకు రాష్ట్రానికి అన్యాయం చేశారు?...ప్రత్యామ్నాయంగా ఇంకో పార్టీ ఉందనే ధీమాతోనే నని చంద్రబాబు బిజెపిపై ధ్వజమెత్తారు. వైసిపి అవినీతి పార్టీ కాబట్టి వారి చెప్పుచేతల్లో ఉంటుందని వారి ఉద్దేశం. ఇవన్నీ వాస్తవాలని...నిజాల్ని దాచిపెట్టలేరని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రానికి నిజంగా న్యాయం కోసం చేసే పోరాటంలో ఎవరు ఎటువైపున్నారో ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
ప్రధానులనే నిర్ణయించిన చరిత్ర...టిడిపిది
తెలుగుదేశం పార్టీకి జాతీయ రాజకీయాలు కొత్త కాదని, ప్రధానులను నిర్ణయించిన చరిత్ర టిడిపికి ఉందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు మొత్తం 25 స్థానాల్లో టీడీపీని ప్రజలు గెలిపిస్తే ఈసారి కూడా ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చేది భిక్ష కాదని, అది మన హక్కు అని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. బీజేపీ-వైసీపీ నేతలు చంద్రబాబుకు భయం అని అంటున్నారని, ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని...కేసులను ఎదుర్కొంటూ వారం వారం కోర్టుకు వెళ్లే వాళ్లకి భయం లేదా?...ఎలాంటి కేసులు లేని నేనేమో భయపడుతున్నానా?...ఇదేమి విచిత్రమని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రం అవినీతి కేసులను ఎందుకు వేగంగా పరిష్కరించడం లేదని, వారికి కావాల్సినవాటిని మాత్రమే ఎందుకు పరిష్కరిస్తున్నారో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
టిడిపిపై సిబిఐ దాడులు...నడవవు
టీడీపీ నేతలపై సీబీఐ దాడులు జరుగుతాయని జరుగుతున్న ప్రచారం గురించి విలేకరులు ప్రశ్నించగా...అలా అని మీడియానే అంటోందని...నిప్పులేనిదే పొగరాదని...తమిళనాడు తరహాలో అన్నీ చేయాలని చూస్తారని...కానీ...అలాంటివి ఇక్కడ నడవవని చంద్రబాబు తేల్చేశారు. ఒకవేళ అలా చేసినా దానికి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ప్రజలు రక్షణ కవచంలా ఉండాలన్నది వ్యక్తిగతంగా తనకు కాదని...రాష్ట్రానికి అండగా నిలవాలని మాత్రమే కోరానని సీఎం చెప్పారు. రాష్ట్రంపై, పాలనపై, ప్రత్యేక హోదాపై, ప్రాజెక్టులు ఆపేందుకూ కుట్రలు చేస్తారని...ఆ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నాను. అంతే తప్ప నాకు రక్షణ కవచం ఎందుకు?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారిని కర్ణాటక ఎన్నికల్లో ఓడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
తిరుపతి సభలో...మోడీ మాటలు
తిరుపతిలో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ నాలుగేళ్ల క్రితం చెప్పిన మాటలనే ఈ నెల 30వ తేదీన జరిగే తిరుపతి సభలో గుర్తు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వెంకన్న సాక్షిగా ఇచ్చిన ఆయన ఇచ్చిన హామీలపై నిలదీస్తామన్నారు. అయితే కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోవాలని కొందరు కోరుకుంటున్నారు...కుట్రలు చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఇక్కడ అభివృద్ది ఆగదని చంద్రబాబు పునరుద్ఘాటించారు.