"చెన్నంపల్లి కోట"లో తాజా తవ్వకాలపై...అధికారుల సరి కొత్త వివరణ
కర్నూలు:జిల్లాలోని చెన్నంపల్లి కోటలో ఎపి ప్రభుత్వం జరిపిస్తున్నగుప్త నిధుల అన్వేషణ విడతలు విడతలుగా కొనసాగుతోంది. రెండున్నర నెలల క్రితం మొదలైన ఈ తవ్వకాలు కోట పరిధిలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో సాగాయి.కోటలో నిక్షిప్తం చేసిన నిధినిక్షేపాల కోసం జియాలజీ అధికారులతో పాటు పూజారులు, మాంత్రికులు, కోయదొరల సూచనల మేరకు తవ్వకాలు కొనసాగించిన అధికారులు ఆ తరువాత కొంతకాలం ఈ తవ్వకాలకు విరామం ఇచ్చారు.
దీంతో ఈ కోటలో అధికారుల అన్వేషణ పూర్తయిందని స్థానికులు భావించారు. అయితే తాజాగా వారం రోజుల క్రితం మళ్లీ అధికారులు తవ్వకాలు ప్రారంభించడంపై స్థానికుల్లో విస్మయం వ్యక్తం అయింది. అయితే ఈ విడత తవ్వకాలను ప్రాచీన శాసనాలు, తాళపత్రాల ఆధారంగా చేపట్టినట్లు అధికారులు చెబుతుండటం విశేషం.మరోవైపు ఈ తవ్వకాల్లో తాజాగా పెద్ద నీటి తొట్టె లాంటిది వెలుగు చూడటం స్థానికుల్లో ఆసక్తి రేకెత్తించింది.
చెన్నంపల్లి కోటలో నిధినిక్షేపాల కోసం అధికారులు జరుపుతున్న అన్వేషణలో తొలిదశలో ఎముకలు, ఏనుగు దంతాలు వంటివి బైటపడగా, ఆ తరువాత సొరంగ మార్గం, సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమయ్యాయి. ఇక తాజాగా పెద్ద గుండు వద్ద చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టి లాంటిది వెలుగు చూడటం ఆసక్తి రేపింది.
గతంలో వివిధ రంగాల వ్యక్తుల సలహాలు,సూచనల ప్రకారం తవ్వకాలు సాగించిన అధికారులు తాజా తవ్వకాలను మాత్రం ప్రాచీన శాసనాలు, తాళపత్రాల ఆధారంగా జరుపుతున్నట్లు వెల్లడించడం గమనార్హం. నెల్లూరు నుంచి తీసుకువచ్చిన 12 మంది కూలీలతో ఉదయం సాయంత్రం అధికారులు ఈ తవ్వకం పనులు జరిపిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకున్నా మరో వారం రోజుల పాటు కొనసాగించి ఆ తరువాత కోటలో తవ్వకం పనులకు స్వస్థి పలకనున్నట్లు అధికారులు అంటున్నట్లుగా తెలుస్తోంది.