రష్యాకు షాక్, ఇజ్రాయెల్ సైన్యంపై వేటు.. ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్
ఐక్యరాజ్యసమితి (UN) విడుదల చేసిన ఒక సంచలన వార్షిక నివేదిక అంతర్జాతీయ వేదికపై తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న సాయుధ సంఘర్షణల్లో లైంగిక హింసకు పాల్పడుతున్న బలగాల బ్లాక్ లిస్ట్ ను ఐరాస ప్రకటించింది. ఈ నివేదికలో 15 ఏళ్ల సమీక్షా చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలను (IDF) ఐరాస చేర్చడం గమనార్హం. పాలస్తీనా ఖైదీల పట్ల ఇజ్రాయెల్ దళాలు వ్యవహరిస్తున్న శైలి, వారిపై జరిగిన అకృత్యాలను ఆధారంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది.
మొత్తం 35 పేజీలతో కూడిన ఈ నివేదికను ఐరాస అధికారికంగా విడుదల చేయాల్సి ఉండగా, అంతకుముందే ఇజ్రాయెల్ దౌత్య మిషన్ దీనిని పంచుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఘర్షణల్లో అమానవీయ లైంగిక దాడులకు బాధ్యత వహించిన 77 ప్రభుత్వ , ప్రభుత్వేతర సంస్థలను ఈ నల్లజాబితాలో చేర్చారు. గడిచిన కొన్నేళ్లుగా, ముఖ్యంగా 2024 నుండి 2025 నాటికి ఇలాంటి ఘోరాల సంఖ్య అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగినట్లు ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, ఉక్రెయిన్ యుద్ధంలో పౌరులు, యుద్ధ ఖైదీలను లైంగిక వేధింపులకు గురిచేసినందుకు గానూ రష్యా సాయుధ, భద్రతా దళాలను కూడా ఈ ఏడాది నల్లజాబితాలో చేర్చడం విశేషం.

ఇజ్రాయెల్ సైన్యంతో పాటు..
ప్రస్తుత 2025 నివేదికలో ఇజ్రాయెల్ సైన్యంతో పాటు హమాస్ ఉగ్రవాద సంస్థను కూడా పక్కపక్కనే ఉంచారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మెరుపు దాడి, ఆ తర్వాతి పరిణామాల్లో జరిగిన అకృత్యాల నేపథ్యంలో హమాస్ను ఇప్పటికే ఐరాస నిషేధిత జాబితాలో చేర్చింది. గతేడాది నివేదికలోనే ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరిస్తూ, తగిన చర్యలు తీసుకోకపోతే ఇజ్రాయెల్, రష్యాలు నల్లజాబితాలోకి వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే నిజమవడంతో అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఈ బ్లాక్ లిస్ట్ పై ఇటు రష్యా, అటు ఇజ్రాయెల్ రాయబారులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ నిర్ణయాన్ని రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా తీవ్రంగా తప్పుబట్టారు. ఇవన్నీ నిరాధారమైన అబద్ధాలని, రష్యాను ఎప్పుడూ విలన్గా చూపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. దీనిపై తాము సెక్రటరీ జనరల్కు నిరసన లేఖ రాస్తామని, ఉక్రెయిన్ వైపు ఉన్న రష్యా యుద్ధ ఖైదీలపై జరుగుతున్న దాడులను కూడా తాము డాక్యుమెంట్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఖైదీలపై సాగించిన హింసను ప్రపంచం ముందు..
అయితే, ఐరాస తన నివేదికలో ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనా ఖైదీలపై సాగించిన హింసకు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచింది. గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాలకు చెందిన 14 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, తొమ్మిది మంది బాలురు, ఒక బాలికపై చిత్రహింసల రూపంలో జరిగిన సంఘర్షణ-సంబంధిత లైంగిక హింసను తాము ధృవీకరించినట్లు నివేదిక పేర్కొంది. ఉల్లంఘనలలో అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు, జననాంగాలపై శారీరక దాడులు, లక్ష్యంగా కాల్పులు జరపడం, భద్రతా కారణాలు లేకపోయినా బలవంతంగా వివస్త్రలను చేసి శరీర తనిఖీలు చేయడం వంటి అమానవీయ చర్యలు ఉన్నాయని నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది.
గాజాకు చెందిన కనీసం తొమ్మిది మంది బాధితులపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), ప్రత్యేక విభాగాలు, జైలు సిబ్బంది పదే పదే దాడులకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని ఐరాస వెల్లడించింది. క్షేత్రస్థాయి పరిశోధనలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతించకపోవడం వల్ల మరికొన్ని వివరాలను స్వతంత్రంగా నిర్ధారించలేకపోయామని పేర్కొంది. ఇదే విధంగా రష్యా కూడా దర్యాప్తు సంస్థలకు అనుమతి నిరాకరించినప్పటికీ, ఉక్రెయిన్ పౌరులు, ఖైదీలపై జరిగిన 310 హింసాత్మక కేసులను తాము రికార్డు చేయగలిగామని ఐరాస స్పష్టం చేసింది. ఈ కేసుల్లో అత్యధికంగా పురుషులే బాధితులుగా ఉన్నారని నివేదిక వివరించింది. ఉక్రెయిన్ పరిధిలోనూ కొన్ని కేసులు నమోదైనప్పటికీ, వారు నిబంధనలు పాటించడంతో ఉక్రెయిన్ను నల్లజాబితాలో చేర్చలేదు.














Click it and Unblock the Notifications