రాజస్థాన్లో వీడిన నాలుగు మర్డర్స్ మిస్టరీ.. మైండ్ బ్లాంక్ అయ్యే క్రైమ్ స్టోరీ !!
రాజస్థాన్ను ఉలిక్కిపడేలా చేసిన దారుణ ఘటనలో పోలీసులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్ సహా నలుగురి హత్య కేసుకు సంబంధించి ఈ అరెస్ట్ జరిగింది. మృతదేహాలను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, మాజీ సర్పంచ్ మొదటి భార్య సునీతే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలడంతో నిందితురాలిని అరెస్టు చేశారు.
కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు వెల్లడించారు. సునీత తన భర్త, అత్తతో పాటు ఇంకో ఇద్దరు కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా చంపినట్లు తేలింది. హత్యల అనంతరం మృతదేహాలను స్కార్పియో వాహనంలో ఉంచి నిప్పంటించి, ఇదో ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా మాజీ సర్పంచ్ మొదటి భార్యే ఉండటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ నెల 28న ఉదయం అజ్మీర్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరాంపుర గ్రామం వద్ద హైవేపై ఓ కారు అగ్నికి ఆహుతవడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎస్యూవీలో పూర్తిగా కాలిపోయిన మూడు మృతదేహాలను కనుగొన్నారు. సమీపంలోని పొలంలో పాక్షికంగా కాలిన మరో మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
మృతులను మాజీ సర్పంచ్ రామ్ సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీ దేవి (79), రెండో భార్య సూర్యగ్యాన్ దేవి (మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు), బంధువు మహిమా చౌదరి (30)గా గుర్తించారు. మొదట దీన్ని ప్రమాదంగా భావించిన పోలీసులు, వారి ఫామ్హౌస్లో రక్తపు మరకలు, గాయాల ఆనవాళ్లను గుర్తించిన తర్వాత దీని వెనుక పక్కా ప్రణాళికతో కూడిన హత్య ఉందని నిర్ధారణకు వచ్చారు.
దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. రామ్ సింగ్ మొదటి భార్య సునీత తన మైనర్ కొడుకు, కూతురితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చాలా కాలంగా నడుస్తున్న కుటుంబ గొడవలు, గృహ హింస కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులు పదునైన వ్యవసాయ పరికరంతో నలుగురి గొంతులు కోసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. తర్వాత మృతదేహాలను వాహనంలోకి ఎక్కించి, కొంత దూరం తీసుకెళ్లి నిప్పంటించారు.
నిందితురాలు సునీత పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలతో కేసును వేగంగా ఛేదించినట్లు అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాలా వెల్లడించారు. అరెస్ట్కు ముందు సునీత బంధువుల మధ్య నాటకీయంగా ప్రవర్తించిందని, ఛాతీ బాదుకుంటూ, స్పృహ కోల్పోయినట్లు నటించిందని పోలీసులు తెలిపారు. ఒకప్పుడు గ్రామంలో ప్రముఖులుగా ఉన్న కుటుంబంలో ఇంతటి దారుణం జరగడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, ఆస్తి తగాదాల కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications