విజయవాడ ముజ్రా పార్టీ వ్యవహారంలో...నిందితులను వదిలేయడంపై హైకోర్టులో పిటీషన్
హైదరాబాద్: విజయవాడ ఆలివ్ట్రీ హోటల్ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తూ పట్టుబడిన కేసులో అధికారపార్టీకి చెందిన నిర్వాహకులను వదిలిపెట్టడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది.
ఈ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన మహ్మద్ ఖాసీం అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పార్టీకి సంబంధించి నిర్వాహకులను వదిలిపెట్టి పాల్గొన్నవారిని అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో నడుస్తున్న ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు.
తన పిటిషన్ లో ఆయన ప్రతివాదులుగా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ వెస్ట్జోన్ ఏసీపీ, భీమునిపట్నం ఎస్హెచ్వోలను చేర్చారు. ఇదిలావుండగా ఇటీవల ఆలివ్ట్రీ హోటల్ లో ముజ్రా పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురు మినహా మిగతా అందరికీ కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ ముగ్గురినీ తదుపరి విచారించాల్సి వుందని, ముజ్రా పార్టీని ఏర్పాటు చేసింది వీరేనని పోలీసులు కోర్టుకు వెల్లడించడంతో వారికి మినహా అందరికీ బెయిల్ ఇస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
మిగతా వారు అంతా రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు చెల్లించి పార్టీని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వారేనని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే పోలీసులు అసలైన నిర్వాహకులను వదిలేశారని, కేవలం పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడంతో పాటు నిర్వాహకులుగా వేరే వ్యక్తులను చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.