సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా -పోలవరం అంచనాలకు కొర్రీలు: పూర్తయ్యేదెన్నడు..!!
పోలవరం పెంచిన అంచనాల వ్యవహారం ఇప్పట్లో తేలదా. ప్రాజెక్టు పూర్తి అయ్యేదెన్నడు. ప్రాజెక్టు అథారిటీ సవరించిన అంచనాల ఆమోదంలో పెడుతున్న కొర్రీలతో ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిని అధిగమించి...అంచనాలకు ఆమోదం పొంది... ప్రాజెక్టుకు నిధుల సాధన..పూర్తి చేయటం ఇప్పుడు సీఎం జగన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. 2021 మే నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం తిరిగి..ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని ఖరారు చేయాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.47,725 కోట్లతో సవరించిన అంచనాల పెట్టుబడి అనుమతికి ప్రాజెక్టు అథారిటీ కొర్రీలు వేసింది.
అథారిటీ మరోసారి కొర్రీలతో
ప్రాజెక్టు అథారిటీ ఈ మొత్తానికి సిఫార్సు చేస్తూ కేంద్ర జలశక్తిశాఖకు వర్తమానం పంపిన తర్వాతే ఓ అడుగు ముందుకు పడుతుంది. అలాంటిది అథారిటీ ఈ వ్యవహారంలో తాజాగా మళ్లీ మెలిక పెట్టింది. అంతకుముందు లేవనెత్తిన సందేహాలకు రాష్ట్ర జల వనరులశాఖ సమాధానాలు అందజేసినా వాటిని పరిశీలించి కొత్తగా కొన్ని కొర్రీలు వేసింది. దీంతో జల వనరులశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు అథారిటీ అడిగిన ప్రకారం అన్నీ పూర్తి చేసి ఇవ్వాలంటే చాలా సమయం పట్టేలా ఉంది. మరోవైపు రూ.35,950 కోట్లకే పెట్టుబడులు ఇస్తామని కేంద్రం రాజ్యసభలో ఇప్పటికే ప్రకటించింది.
సమయం గడిచేకొద్దీ సమస్యలే
దీనికీ పోలవరం అథారిటీ సిఫార్సు అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో వేస్తున్న ఈ కొర్రీలన్నీ ఇక్కడి యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రాజెక్టువల్ల ఉభయగోదావరి జిల్లాల్లో ఎన్ని నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయో కచ్చితమైన లెక్కలతో మళ్లీ సమాచారం పంపాలని అథారిటీ కోరింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆయా కుటుంబాల్లో యుక్త వయసువారు పెరుగుతున్నారని, దానివల్ల ఈ సంఖ్యలో ఎప్పటికప్పుడు మార్పు ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లాల్లో ఇంకా కొన్నిచోట్ల సామాజిక ఆర్థిక సర్వే చేయాల్సి ఉంది. నిర్వాసిత కుటుంబాల జాబితాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల్సి ఉంది. కేంద్రం నుంచి రూ.2,000 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది.
అంచనాల ఆమోదంలో తాత్సారం
ప్రస్తుతం రూ.340 కోట్ల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చిందని సమాచారం. వచ్చే వారంలోగా ఆ నిధులు వచ్చే అవకాశం ఉంది. మరో రూ.371 కోట్లకు సంబంధించిన బిల్లుల ప్రక్రియ మరికొన్ని దశలు దాటింది. అవి కూడా మరికొన్ని రోజుల్లో రావచ్చని ఇటీవల ప్రాజెక్టుకు వచ్చిన కేంద్ర అధికారులు సమాచారాన్ని ఇచ్చారు.
ఇంతకుముందు ప్రాజెక్టును 2021 మే నాటికి పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అథారిటీకి షెడ్యూలు ఇచ్చింది. ఆ మేరకు పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త షెడ్యూలు తయారు చేసి పంపాలని అథారిటీ సూచించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తామని కేంద్రం పేర్కొంది.
జగన్ సమర్ధతకు పరీక్షగా
అలాంటిది ఇప్పుడు పనుల నిలిపివేత ఉత్తర్వులు తొలగింపు అంశంలోనూ మెలిక పెడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం. సానుకూల పరిస్థితులు లేకపోవడంవల్లే కొర్రీలపై కొర్రీలు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అథారిటీ అడిగిన ప్రకారం అన్నీ పూర్తి చేసి ఇవ్వాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే దీని పైన సీఎం జగన్ నేరుగా కేంద్ర జలశక్తి మంత్రికి పలుమార్లు కలిసి పరిస్థితిని వివరించారు. వినతి పత్రాలు అందించారు. అయితే, ఇప్పుడు మరోసారి అథారిటీ పెడుతున్న కొర్రీలను పరిష్కరించుకుంటూ... ప్రాజెక్టుకు నిధుల మంజూరు - పూర్తి చేయటం పైన సీఎం జగన్ ఇక కేంద్రంతో నేరుగా మాట్లాడాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.