అతని పేరు 'అరాచకం'.. చదువుకుంది 'థర్డ్ డిగ్రీ'!?
కేసు విచారణకు పిలిపించి విపరీతంగా కొట్టడం, బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపైనే రివర్స్ కేసులు పెట్టడం, సంబంధం లేని కేసుల్లో ఇరికించి వారిని థర్డ్ డిగ్రీతో హింసించడం, స్థానిక ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తూ రాజకీయం వంటబట్టిన పోలీస్ నేతగా ఆ అధికారి పేరు గడించారు. ఆయన పేరు వినపడితే చాలు అరాచకానికి పరాకాష్ట అనే మాట వినపడుతోంది.
అత్యంత వివాదాస్పద అధికారిగా పేరు
పేరులో ఎంతో చైతన్యాన్ని నింపుకున్న సదరు పోలీసు అధికారి ప్రతిపక్ష నేతలను విచారణకు పిలిపించి చిత్రహింసలకు గురిచేయడంలో అందెవేసిన చెయ్యి. ఆ అధికారి తీవ్రంగా కొట్టారంటూ ఎంతోమంది న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రయివేటు కేసులు దాఖలు చేశారు. మహిళలను ఉద్దేశించి తీవ్ర పదజాలం ఉపయోగిస్తారు. అక్కడ ఆయన పదవి చేపట్టి రెండు సంవత్సరాలైంది. అత్యంత వివాదాస్పద అధికారిగా రాష్ట్రంలోనే పేరు తెచ్చుకున్నారు. తాను రక్షించాల్సిన న్యాయం, చట్టం, ధర్మంలాంటివన్నీ అతను పక్కనపెట్టాడు. తన మార్క్ న్యాయం, తనకు తెలిసిన ధర్మం ఉపయోగిస్తారు.
మహిళ గురించి అసభ్యంగా మాట్లాడి..
అనంతపురం జిల్లాలో ఒక సబ్ డివిజన్ కు డీఎస్పీ ర్యాంకు అధికారిగా పనిచేస్తున్నారు. వివేకా నందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వ్యక్తి సీబీఐ బలవంతం చేసిందంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఈ కేసును సదరు అధికారికి అప్పగించగా సాక్షిగా ఉన్న వ్యక్తిని తీవ్రంగా వేధించారు. పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఆన్ లైన్ మోసంతో రూ.15లక్షలు పోగొట్టుకున్నారు. ఆయన ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేయగా ఈ కేసును డీఎస్పీ దగ్గరకు పంపించారు. పోయిన డబ్బులు రావని, ఇంటికి వెళ్లి అడుక్కుతినమన్నారని, నేను మీ ఇంటికి వస్తాను.. నేను, నీ భార్య, నువ్వు కలిసి భజన చేద్దామంటూ అసభ్యంగా మాట్లాడారని బాధితుడు వాపోయారు. మనస్తాపం చెందిన సదరు వ్యక్తి ఈ విషయం గురించి ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆయన ఆచూకీ లభించింది.
పదుల సంఖ్యలో ప్రయివేటు కేసులు
ఎమ్మెల్యే కుమారుడు దాడిచేశాడని, కేసు పెట్టాలంటూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకులు డీఎస్పీని ఆశ్రయించగా ఎమ్మెల్యే కుమారుడిపైనే కేసు పెట్టమంటావా? అంటూ ఆ వ్యక్తిని ఇష్టారాజ్యంగా కొట్టారు. దీంతో ఆ వ్యక్తి ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించారు. డీఎస్పీకి అండగా ఉండే పార్టీ నాయకుడి అనుచరులు మరోసారి దాడికి తెగబడ్డారు. ఆ డీఎస్పీపై పదుల సంఖ్యలో ప్రయివేటు కేసులు దాఖలవగా అన్ని కేసుల్లోను న్యాయమూర్తులు ఫిర్యాదు దారుల నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు.