జగన్ ప్రభుత్వంపై టీడీపీ కొత్త పోరాటం - ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు : డిసెంబరు 1 నుంచి..!!
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాల పైన వైసీపీని మరింతగా ఇరుకున పెట్టేలా టీడీపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. తాజాగా జరిగిన పార్టీ పొలిట్ బ్యూరోలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలు.. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీరు అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఘటన ద్వారా వైసీపీని మరింతగా ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహం కొనసాగించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. ఆడపడుచుల ఆత్మగౌరవం కోసం డిసెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించాలని తెదేపా పొలిట్ బ్యూరో నిర్ణయించింది.
టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకు
శాసనసభను కౌరవ సభగా మార్చి మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజాచైతన్యం కల్పించాలని డిసైడ్ అయింది. శాసనసభలో జరిగిన పరిణామాలు.. మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేసారో ప్రజలను ఈ సభల ద్వారా వివరించనున్నారు. తాను తిరిగి సీఎం అయ్యే వరకూ సభలో అడుగు పెట్టనంటూ చేసిన శపధాన్ని పాలిట్ బ్యూరో ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. వరద మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. తుపాను ముందస్తు చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని, వరద తీవ్రతకు ఇసుక మాఫియా చర్యలూ కారణంగా ఉన్నాయని పేర్కొంది
రూ 25 లక్షల మేర పరిహారం ఇవ్వాలి
వరద మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాలిట్ బ్యూరో తీర్మానించింది. పెంచిన పెట్రోలు..డీజిల్ ధరల వలన ప్రజల పైన భారం పడుతోందని.. పెట్రోలు పై రూ 16, డీజిల్ పై రూ 17 ధర తగ్గించాలని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అర్ద రహితమని... ఈ రెండున్నారేళ్లల్లో ఎక్కడా డెవలప్ మెంట్ కోసం రూపాయి ఖర్చు చేయలేదని సమావేశం అభిప్రాయపడింది.
Recommended Video
వివేకా నిందితులకు శిక్ష పడాలి
1983 నుంచి ఉన్న ఇళ్లకు డబ్బులు చెల్లించాలంటూ ప్రభుత్వం సామాన్యలను ఒత్తిడి చేయటాన్ని ఖండించారు. వరి వేయకూడదంటూ చేసిన ప్రకటనను సమావేశం ఖండించింది. కాగా, తాజాగా జరిగిన స్థానిక సంస్థల్ ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ పెరిగిందని అభిప్రాయపడింది. ఇక, వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా సీబీఐని కోరారు. ఇదే సమావేశంలో పాలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ ను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆరోజున మండలిలో బిల్లు విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అమరావతికి అనుకూలంగా మారిందని చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు టీడీపీ ప్రారంభిస్తున్న ఆడపడుచుల ఆత్మగౌరవ సభల పైన వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.