తెర వెనక ఆ ఇద్దరూ పవన్ కల్యాణ్కు కటీఫ్: మరి ఎలా?
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ విషయంలో తెర వెనక ఇద్దరు కీలక వ్యక్తులు ప్రధానమైన పాత్ర పోషించారు. వారిద్దరు కూడా పవన్ కల్యాణ్కు దూరమైనట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
హైదరాబాద్: తన పార్టీని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఒంటి చేతి మీద లాక్కొస్తున్నారు. అయితే, దాని స్థాపన నుంచి ఇద్దరు వ్యక్తులు తెర వెనక కీలకంగా పనిచేశారు. వారిలో ఒకరు సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ కాగా, రెండో వ్యక్తి రాజు రవితేజ. రాజు రవితేజ గురించి జనసేన తొలి సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు.
ప్రస్తుతం వారిద్దరు కూడా పవన్ కల్యాణ్ వెంట ఉండడం లేదనే ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా వెంట వారిలో ఒకరు కనిపిస్తుండేవారు. వారిద్దరు కూడా ఇప్పుడు పవన్ కల్యాణ్కు కటీఫ్ చెప్పినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వారు ఎందుకు దూరంగా జరగారనే విషయం మాత్రం తెలియడం లేదు.
కాగా, పవన్ కల్యాణ్కు మరో ఇబ్బంది కూడా ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమా ఉగాది విడుదల కాబోతోంది. దాంతో పాటు రాజమౌళి చిత్రం బాహుబలి -2 కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల అవుతుండడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు.
అయితే, అదే సమయంలో బాహుబలికి వచ్చిన ప్రచారం, దాని పట్ల నెలకొన్న పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాను దెబ్బ కొడుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.