ఏపీ నుంచి కేంద్రానికి రెండు లక్షల కోట్లు - నిధుల మళ్లింపు పై క్లారిటీ : పార్లమెంట్ వేదికగా..!!
ఏపీ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ప్రతీ ఏటా ఎంత వెళ్లనుంది. దీని పైన కేంద్రం ఏం చెబుతోంది. అదే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేర పన్నుల వాటా దక్కుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో నిధుల మళ్లింపు జరుగుతోందా. ఈ అంశాలకు పార్లమెంట్ వేదికగా కేంద్రమే స్పష్టత ఇచ్చింది. రాజ్యసభలో ఏపీ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఎంత మేర దక్కుతుందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. గత మూడేళ్ల కాలంలో పన్నుల రూపంలో ఏపీ నుంచి కేంద్రానికి రూ.2,07,686.16 కోట్లు వచ్చినట్లుగా కేంద్ర మంత్రి ఆ సమాధానంలో స్పష్టం చేసారు.
2018-19 నుంచి 2020-21 వరకు ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.1,29,264.16 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.78,604 కోట్లు వచ్చాయని తెలిపారు. అలాగే పన్నుల పంపిణీ రూపంలో 2020-21లో రాష్ట్రానికి రూ.24,460.59 కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.7,531కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీకి రూ.1,524 కోట్ల జీఎస్టీ పరిహారం చెల్లించాల్సి ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే, కేంద్ర మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం 2018-19లో ఏపీ నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.46,222.64 కోట్లు వెళ్లగా 2019-20లో అవి రూ.42,730.45 కోట్లకు తగ్గాయి. తర్వాత 2020-21లో మరింతగా అంటే రూ.40,314.07 కోట్లకు తగ్గింది.
ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కనకమేడల కేంద్రం స్థానిక సంస్థలకు విడుదల చేసిన నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించినట్లుగా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. నిధులను ఏపీ ప్రభుత్వం మళ్లించినట్లు సంబంధిత శాఖలు తమ దృష్టికి తీసుకురాలేదని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామ పంచాయతీలకు 2019-20లో రూ.2,336.55 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం పంచాయతీలు, గ్రామీణ స్థానిక సంస్థలకు కలిపి 2020-21లో రూ.2,625కోట్లు, 2021-22లో రూ.969.5 కోట్లు విడుదల చేశామని వివరించారు. మరోవైపు, విభజన చట్టం ప్రకారం నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.1,750 కోట్లు విడుదల చేశామని, అందులో 1,049.34 కోట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యూసీలు అందించిందనివ వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి బోస్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టత ఇచ్చింది.