మళ్లీ జగన్ వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ? వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు. వాలంటీర్లకు ఇస్తున్న గౌరవ వేతనాల నిలిపివేత, విధుల అప్పగింత నిలిపివేత, ఎన్నికల హామీ ప్రకారం 10 వేలకు జీతాల పెంపు ఇలా... ఎటు చూసినా వాళ్లకు షాకులు తప్పలేదు. దీంతో వాలంటీర్లు మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే తమకు మంచిరోజులు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి జగన్ అధికారంలోకి వస్తే వాలంటీర్లు మళ్లీ కనిపిస్తారా ?
ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, జగన్ కు సన్నిహితుడిగా పేరున్న మంత్రాలయం వైసీపీ నేత బాల నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని తాము ప్రజలకు న్యాయం చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవస్ధ కారణంగా ప్రజలు, నాయకుల మధ్య దూరం పెరిగిందన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తేల్చిచెప్పేశారు. వాలంటరీ వ్యవస్థే తమ కొంపముంచిందన్నారు.

ఓవైపు వైసీపీ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ గొప్పగా పనిచేసిందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన సాగించామని చెప్పుకుంటున్న ఆ పార్టీ నేతలు.. పలు సందర్భాల్లో దీనికి విరుద్దమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే అధికారులు, ప్రభుత్వానికి తామంటే లెక్కలేకుండా పోయిందన్న అసంతృప్తి ఎలాగో వారిలో ఉంది. అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఆదుకుంటామని హామీలు ఇచ్చినా, కూటమి సర్కార్ ఇచ్చిన 10 వేలకు జీతాల పెంపు హామీ ఫలించడంతో అధికారం చేతులు మారింది. ఇప్పుడు అటు కూటమి, ఇటు వైసీపీ వాలంటీర్ల వ్యవస్థను వద్దంటుండటం విశేషం.












Click it and Unblock the Notifications