"ఆ పదానికి పేటెంట్ చంద్రబాబే!, చీకటి ఒప్పందాలు.. వెన్నుపోటు ఉదంతాలు"
మానవ హక్కుల సంఘాలు అంతర్జాతీయంగా ఫిర్యాదు చేయడం ఇంతకుముందు కూడా జరిగిందని గుర్తుచేశారు. ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్ పై గతంలో చంద్రబాబును మానవహక్కుల సంఘాలు అడ్డుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి అమెరికా పర్యటన ఈమెయిల్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. నిధుల సేకరణ కోసమే ఆయన అమెరికాలో అడుగుపెట్టారని, అనుమతి లేకుండా ఈ తరహా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన్ను అరెస్టు చేయాలని మానవ హక్కుల సంఘాల పేరిట అక్కడి మేయర్ చేతవాన్ డ్యూన్కు మెయిల్స్ వెళ్లడం కలకలం రేపింది.
అయితే ఇదంతా ప్రతిపక్షం కుట్రేనని టీడీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం ఆరోపణలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుపై ఫిర్యాదు చేసింది మానవ హక్కుల సంఘాలే అని అన్నారు.
మానవ హక్కుల సంఘాలు అంతర్జాతీయంగా ఫిర్యాదు చేయడం ఇంతకుముందు కూడా జరిగిందని గుర్తుచేశారు. ఎర్రచందనం కూలీల ఎన్ కౌంటర్పై గతంలో చంద్రబాబును ఢిల్లీలో మానవహక్కుల సంఘాలు అడ్డుకున్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కుట్రలు అనే పదానికి పేటెంట్ చంద్రబాబే అని, చీకట్లో ఒప్పందాలు, వెన్నుపోటు ఉదంతాలు ఆయనకే సొంతమన్నారు.
వెయ్యి కుట్రలు కలిపితే ఒక చంద్రబాబు అవుతారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానపరిచేలా టీడీపీ వ్యవహరించవద్దని, ఈమెయిల్ దర్యాప్తు నెపంతో వైసీపీ మీద ఇష్టానుసారం మాటలు తూలితే సహించేది లేదని హెచ్చరించారు.