అసెంబ్లీలో మాటల యుద్దం.. గత ప్రభుత్వం పోలవరం అంచనాలు పెంచిందన్న వైసీపి..! తిప్పికొట్టిన బాబు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ శాసన సభలో మాటల యుద్దం నడిచింది. అదికార విపక్షాల మద్య పోలవరంపై గరంగరం వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. గత ప్రభుత్వం పోలవరం అంచనాలు కావాలనే పెంచిందంటూ అసెంబ్లీలో అధికార పక్షం చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు. ఆ ఆరోపణలలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. సోమవారం అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వంపై అధికారపక్షం తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో స్పందించిన చంద్రబాబు.. ప్రాజెక్టు పూర్తికావాలనే అంచనాలు పెంచి పనులు చేశామని బదులిచ్చారు. కొత్త అంచనాలను కేంద్రప్రభుత్వం ఆమోదించిందని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడేనాటికి స్పిల్వే దగ్గర కూడా భూసేకరణ చేయలేదన్నారు. తాము లక్ష ఎకరాలకు పైగా భూసేకరణ చేశామని చంద్రబాబు వివరించారు. 2014 చట్టం వల్ల నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం పెరిగిందన్నారు. దీంతో అంచనాలు కూడా పెరిగాయని తెలిపారు. వైఎస్ఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు పోలవరంపై చర్చకు తాము సిద్ధం అని అధికారపక్షానికి చంద్రబాబు సవాల్ విసిరారు.
జగన్ అమ్మ ఒడి పథకం ఎఫెక్ట్ .. పిల్లల్ని ఎత్తుకెళ్ళి స్కూళ్ళలో పడేస్తున్న తల్లిదండ్రులు
Recommended Video
పోలవరానకి కావాలనే నిధులు పెంచారన్న వైసీపి..! కాదన్న చంద్రబాబు..!!
వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యపానాన్ని దశలవారీగా కాకుండా ఒకేసారి రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ నుంచి మరింత ఆదాయాన్ని ఆశిస్తున్నట్టు బడ్జెట్లో చెప్పారన్నారు. రైతులకు సున్నా వడ్డీ రుణాలకు 100 కోట్ల రూపాయలు కేటాయించారని ఆయన విమర్శించారు. 3500 కోట్ల రూపాయలు కేటాయిస్తానన్న జగన్కు రైతుల పట్ల ప్రేమ లేదా? అని గోరంట్ల ప్రశ్నించారు. సున్నా వడ్డీ పాత బకాయిలు 1100 కోట్ల రూపాయలు ఉన్నాయని, మరి 100 కోట్ల రూపాయలు ఎలా సరిపోతాయన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమను వ్యతిరేకించారని, ఇప్పుడు పట్టిసీమ వల్లే డెల్టాకు నీరు అందుతోందని ఎలా చెప్పగలుగుతున్నారని గోరంట్ల వ్యాఖ్యానించారు.
సున్నా వడ్డీ రుణాలపై మాటల యుద్దం..! కేటాయింపులు తగ్గించారన్న టీడిపి..!!
బడ్జెట్లో విద్యాశాఖకు గతం కంటే తక్కువ నిధులు కేటాయించారని, నిధులు తగ్గించి ఏవిధంగా స్కూళ్లలో మౌలికవసతులు కల్పిస్తారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రానికి కంపెనీలు వచ్చాయని, గుజరాత్కు వెళ్లాల్సిన కియా కంపెనీ ఏపీకి తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. వైసీపీ కొత్త ప్రభుత్వం వచ్చాక విత్తన కంపెనీలు మూతబడ్డాయని గోరంట్ల ఆరోపించారు. 45 సాగునీటి ప్రాజెక్టులకు 13 వేల కోట్ల రూపాయలు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్దీకరణ చేస్తామన్నారని, ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీసుకు కిలోమీటరు దూరంలోనే ఆపేస్తున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు.
అమ్మఒడికి నిధులు లేవా..! మరి చదువులు ఎలా సాగుతాయన్న లోకేష్..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామన్న జగన్..మాట తప్పలేదా? అని టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ ప్రశ్నించారు. సోమవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ బడ్జెట్లో అమ్మ ఒడి, హౌసింగ్కు తక్కువ కేటాయింపులు చేశారని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని టెక్నాలజీ ద్వారా నాణ్యమైన ఇళ్లు టీడీపీ ప్రభుత్వం నిర్మించిందన్నారు. రాష్ట్రంలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4లక్షల మందిని వాలంటీర్లుగా నియమిస్తామని అధికార పార్టీ చెబుతోందని లోకేష్ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని లోకేష్ వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలను గ్రామ వాలంటీర్లుగా నియమిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలు దోచుకునేందుకు తీసుకొచ్చిన పథకం ఇదని ఆయన విమర్శించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ కాకుండా టీడీపీ ప్రభుత్వం 5లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, ఇదే విషయం వైసీపీ మంత్రి స్వయంగా సభలో ప్రకటించారని లోకేష్ పేర్కొన్నారు.
రుణ మఫీ పై స్పష్టత ఇచ్చిన టీడిపి..! అసలు రుణాలు మాఫీ కాలేదన్న వైసీపి..!!
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విత్తనాల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని.. అయితే ఏపీ విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయి? అని లోకేష్ నిలదీశారు. అన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వమే కారణమంటారా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతుల రుణాలు మాఫీ చేశామని, ఐదేళ్లలో సున్నా వడ్డీ రుణాలకు 934కోట్ల రూపాయలు ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేసిందన్నారు. అసెంబ్లీలో చాలెంజ్ చేసిన సీఎం జగన్.. సున్నా వడ్డీ రుణాలకు బడ్జెట్లో 100కోట్ల రూపాయలే కేటాయించారని లోకేష్ ఎద్దేవా చేశారు.