జగన్ వైపు బీజేపీ, కాంగ్రెస్ చూపు - అక్కడ నెగ్గాలంటే ఏపీలో తగ్గాల్సిందే..!!
ఏపీ ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో తిరిగి అధికారం దక్కించుకొనేందుకు జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇంఛార్జ్ ల మార్పుతో పాటుగా సామాజిక సమీకరణాలతో ప్రత్యర్ధులకు చెక్ చెబుతున్నారు. పొత్తులతో జగన్ ను ఓడించేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జగన్ పార్టీ పార్లమెంట్ లోనూ కీలకంగా మారే పరిస్థితి కినిపిస్తోంది. ఈ లెక్కలే ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
కొత్త వ్యూహాలు : ఏపీలో ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇటు జగన్ తనకు ఎవరితో పొత్తులు ఉండవని ప్రకటించారు. అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ తోనూ సంప్రదింపులు జరుగుతున్నాయి. బీజేపీ కలిసి వస్తుందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. అటు బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం రాష్ట్రాల వారీగా పొత్తుల వ్యవహారంలో ఆచి తూచి నిర్ణయం తీసుకుంటోంది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో ఏపీ నుంచి ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.

వైసీపీ 11 - టీడీపీ : కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమ నిర్ణయాల అమలులో రాజ్యసభ కీలకంగా మారుతోంది. అక్కడ ప్రస్తుతం వైసీపీకి 9 మంది సభ్యుల బలం ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తూ వచ్చింది. ఇక, మార్చిలో రాజ్యసభలో ఖాళీ కానున్న 55 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 11. మార్చిలో ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసీపీ, టీడీపీ, బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తమ స్థానం తో పాటుగా మరో రెండు స్థానాలను తమ ఖాతాలో వేసుకోనుంది. దీంతో ప్రస్తుతం 9గా ఉన్న వైసీపీ బలం 11కి చేరనుంది. టీడీపీకి ప్రాతినిధ్యం ఉండదు. దీంతో..రాజ్యసభలో తొలి నాలుగు అతి పెద్ద పార్టీల్లో వైసీపీ చేరనుంది. నిర్ణయాలు..బిల్లుల ఆమోదంలో కీలకం కానుంది.

ఎవరు ఎవరి వైపు : వైసీపీ అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉంటోంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలిస్తే ఇక జగన్ పార్టీ నుంచి రాజ్యసభలో మద్దతు బీజేపీ కూటమికి ఉంటుందా లేదా అనేది సందేహమే. ఇండియా కూటమి వైపు జగన్ మొగ్గు చూపే అవకాశం లేదు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఫలితాలు ఎలా ఉన్నా.. రాజ్యసభలో మాత్రం వైసీపీ సంఖ్య బలంలో మార్పు ఉండదు. అసెంబ్లీలో ప్రస్తుత సంఖ్య బలం ఆధారంగానే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో..రాజ్యసభలో సమీకరణాలు ఇప్పుడు పొత్తుల అంశంలో ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక..ఏపీలో ఎవరు ఎవరితో కలుస్తారు.. రాజ్యసభ లో వైసీపీ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి కర అంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications