ఎస్ఐ ఇంట్లో చోరీ: భార్యా, బంధువులపై ఎస్ఐ ఫిర్యాదు, వేధిస్తున్నాడని భార్య కూడా
చిత్తూరు: జిల్లాలోని పీలేరు ఎస్ఐ రాజశేఖర్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే, తన భార్య శోభారాణి, ఆమె బంధువులు మరో ఏడుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు రాజశేఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఈ మేరకు పీలేరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, పీలేరు ఎస్ఐ, ఆయన భార్య మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
తాను విధి నిర్వహణలో భాగంగా చిత్తూరు వన్టౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి.. తిరిగొచ్చేసరికి ఇంట్లోని రూ.46 వేల విలువ చేసే బంగారు ఆభరణాలు, కెమెరా, సర్టిఫికెట్లు చోరీకి గురైనట్లు ఎస్ఐ రాజశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన భార్య శోభారాణి, సమీప బంధువులు కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర, రాములమ్మ, నాగవేణి, పుష్ప, సులోచన, లక్ష్మి, హైదరాబాద్కు చెందిన సుజాతలపై ఆయన ఫిర్యాదు చేశారు.తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషనలోనే ఆయన ఫిర్యాదు ఇవ్వడం గమనార్హం. దీనిపై ఏఎస్ఐ సురేష్బాబు ఆదివారం కేసు నమోదు చేశారు.
ఇది ఇలా ఉండగా, రెండు రోజుల కిందట ఎస్ఐ రాజశేఖర్ భార్య శోభారాణి కర్నూలు జిల్లాలో ఎస్ఐ బంధువులు, స్నేహితులపై ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదైంది. అదే సమయంలో శోభారాణి సోమవారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డిని కలిశారు.
ఎస్ఐ రాజశేఖర్ తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా కిడ్నాప్ చేయడం, కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఎస్ఐ రాజశేఖర్ను పిలిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.