నాడు సీఎం జగన్ కేసులో - నేడు అమరావతి వ్యాజ్యంలో : సీజేఐ లలిత్ కీలక నిర్ణయం..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ అమరావతి కేసు నుంచి తప్పుకున్నారు. ఏపీ హైకోర్టు అమరావతిలో రాజధాని కొనసాగించాంటూ ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ కేసును త్వరగా విచారించాలంటూ ప్రభుత్వం సీజేఐను అభ్యర్ధించింది. ఈ కేసు సీజేఐ బెంచ్ మీదకు రాగా, అనూహ్యంగా సీజేఐ లలిత్ ఈ కేసు నుంచి తప్పుకున్నారు. తాజాగా మంగళవారం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చిన సమయంలో రైతుల తరఫు న్యాయవాది గతంలో రాష్ట్ర విభజన అంశానికి సంబంధించి విభజన బిల్లుపైన న్యాయవాదిగా తన అభిప్రాయాలను వెల్లడించిన విషయాన్ని గుర్తు చేసారు.
2014లో రాష్ట్ర విభజన సమయంలో అనేక న్యాయ సంబంధింత అంశాల పైన హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి అప్పట్లో సీనియర్ న్యాయవాదిగా ఉన్న జస్టిస్ లలిత్కు లేఖ రాశారు. దీనికి సమాధానంగా ఆ సందేహాలకు సీనియర్ న్యాయవాదిగా లలిత్ దాదాపు 29 పేజీల్లో తన అభిప్రాయాన్ని వివరించారు. ఈ విషయాన్ని న్యాయవాది గుర్తు చేయటంతో, వెంటనే అమరావతి కేసును మరో ధర్మానసం ముందుకు బదిలీ చేయాలంటూ విచారణ నుంచి సీజేఐ తప్పుకున్నారు. గతంలో, ఇదే తరహాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2020 నవంబరులో జస్టిస్ రమణపై పలు ఆరోపణలు చేస్తూ అప్పటి చీఫ్జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు జగన్ లేఖ రాశారు.
ఈ లేఖను మీడియాకు కూడా బహిర్గతం చేసిన నేపథ్యంలో ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఇది జస్టిస్ లలిత్ ముందుకు విచారణకు వచ్చింది. అయితే.. గతంలో న్యాయవాదిగా తాను జగన్ తరఫున వాదించానని, ఇప్పుడు న్యాయమూర్తిగా ఆయనపై దాఖలైన కేసులో విచారణ జరపలేనని జస్టిస్ లలిత్ స్పష్టం చేసారు. దీంతో, ఇప్పుడు అమరావతి కేసును మరో ధర్మానసం కు బదిలీ కానుంది. ఇదే సమయంలో ఈ నెల 8వ తేదీన సీజేఐగా లలిత్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ లోగానే మరో బెంచ్ కు కేసు బదిలీ అవుతుందా, లేక కొత్త సీజేఐ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ కేసు పైన నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఇటు ఏపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎటువంటి అడుగులు వేయనుందనేది ఆసక్తిగా మారుతోంది.