నాడు పవన్ - నేడు బాలయ్య కోసం : రూటు మార్చిన బాలినేని - టార్గెట్ ఫిక్స్..!!
వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి రెడ్డి రాజకీయం మారుతోంది. ప్రకాశం జిల్లా పార్టీలో బాలినేని మాట ఫైనల్. ఇప్పుడు సొంత పార్టీలోనే కాదు.. ప్రత్యర్ధి పార్టీలకు బాలినేని కావాల్సిన వారవుతున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా బాలినేనిని అభినందించారు. ఇప్పుడు బాలయ్య సాక్షిగా వీరసింహారెడ్డి వేడుక వేదిక నుంచి ప్రశంసలు అందాయి. ఈవెంట్ నిర్వహణకు సహకరించిన బాలినేనికి సినిమా దర్శకుడు ధన్యవాదాలు చెప్పారు. బాలినేని పక్కా వ్యూహాత్మకంగా తన రాజకీయ భవిష్యత్ కోసం అడుగులు వేస్తున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీలో చర్చకు కారణమవుతోంది.
ప్రకాశం జిల్లాలో వైసీపీ కీలక నేతగా..
బాలినేని శ్రీనివాస రెడ్డి తొలి నుంచి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. జగన్ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసారు. 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా వ్యవహరించారు. కేబినెట్ ప్రక్షాళన సమయంలో మంత్రి పదవి తొలిగింది...అదే జిల్లాకు చెందిన సురేష్ ను కొనసాగించారు.
ఆ సమయంలో బాలినేని మనస్థాపానికి గురయ్యారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆయన ఇంటికి వెళ్లి సీఎం వద్దకు తీసుకొచ్చారు. ఆ భేటీతో బాలినేని తిరిగి పార్టీ కార్యక్రమాలకు దగ్గరయ్యారు. ఇప్పుడు పార్టీ నెల్లూరు ఇంఛార్జ్ గా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో బాలినేనితో పాటుగా ఆయన కుమారుడు కూడా పోటీకి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో బాలినేని గతం కంటే భిన్నంగా..రాజకీయాలకు అతీతంగా వేస్తున్న తాజా అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
బాలినేనికి పవన్ ప్రశంసలు
వైసీపీ పైన విరుచుకుపడే జనసేనాని పవన్ కొన్ని సందర్భాల్లో బాలినేని పైన ప్రశంసలు కురిపించారు. వైసీపీలో మాజీ మంత్రి బాలినేని వంటి పెద్దలు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. తాను ఒక్క మాట అడగగానే ఎంత గౌరవంగా వ్యవహరించారో వివరించారు. ఒంగోలుకు చెందిన జనసేన పార్టీ మహిళా నేత రాయపాటి అరుణపై కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కేసుల విషయాన్ని తాను బాలినేని శ్రీనివాసరెడ్డికి వివరించగా.. ఆయన వెంటనే పెద్ద మనసుతో స్పందించి కేసులు ఉపసంహరించుకున్నారని పవన్ వివరించారు. దీంతో, అప్పటి నుంచి జనసేన నేతలు బాలినేని పైన విమర్శలు ఆపేసారు.
జిల్లాలో తనకు వ్యతిరేకంగా కొందరు చేస్తున్న రాజకీయం పైన కొన్ని సందర్బాల్లో బాలినేని ఫైర్ అయ్యారు. ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు వీరసింహారెడ్డి ఈవెంట్ కి సహకారం...
ఒంగోలులో నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ నిర్వహణ పైన తాజాగా తీసుకొచ్చి జీవోతో అడ్డంకులు వచ్చాయి. చివరకు ఒంగోలు కేంద్రంగానే సభ నిర్వహించారు. సినిమా గురించి వివరించిన వీరసింహా రెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మాజీ మంత్రి బాలినేనిక ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈవెంట్ నిర్వహణకు సహకరించాలని ధన్యవాదాలు చెప్పారు. ఇక, ఇప్పుడు ఈ ప్రశంసలే బాలినేని ప్రత్యర్ధులకు రుచించటం లేదు. తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపాలనేది బాలినేని వ్యూహం. అయితే, ఈ సారి ఎన్నికల్లో బాలినేని పోటీ చేయాలని సీఎం జగన్ సూచించినట్లుగా తెలుస్తోంది. మరి..ఎన్నికల్లో ఈ ప్రశంసలు ..సత్సంబంధాలు ఎంత వరకు కలిసి వస్తాయనేది చూడాలి.