కంటగింపుగా వైఎస్ జగన్ బటన్ ? గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు- ఇప్పుడు చంద్రబాబు !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించేందుకు సీఎం జగన్ ఆ మొత్తాల్ని వారి ఖాతాల్లోకే పంపుతున్నారు. ఇందుకోసం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కుతున్నారు. ఇలా ప్రతీ ఏటా పదుల సంఖ్యలో బటన్ క్లిక్స్ అలవోకగా సాగిపోతున్నాయి. ఇదే ఇప్పుడు విపక్షాలతో పాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం కంటగింపుగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

వైఎస్ జగన్ బటన్ క్లిక్
ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ప్రయోజనం పూర్తి స్దాయిలో ప్రభుత్వానికి లభించేందుకు డీబీటీ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని సాయంతో ఇప్పటికే లక్షన్నర కోట్లకు పైగా మొత్తాన్నిఈ మూడేళ్లలో లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా పంపేశారు. ఇందుకోసం సీఎం క్యాంపు కార్యాలయంలోనే బటన్ క్లిక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు.
ప్రతీ ఏటా సంక్షేమ పథకాలకు క్యాలెండర్ రిలీజ్ చేయడం, దానికి తగినట్లుగానే కచ్చితంగా బటన్ నొక్కేయడాన్ని అలవాటుగా మార్చేసుకున్నారు. దీంతో దళారుల ప్రభావం లేకుండా పోయింది. ప్రజాప్రతినిధుల జోక్యం కూడా తగ్గిపోయింది. అక్కడే కొత్త సమస్య మొదలైంది.

వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి?
సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి అన్ని పథకాల మొత్తాలూ బటన్ నొక్కేసి జనం ఖాతాల్లోకి పంపేస్తుంటే ఇక ఎమ్మెల్యేలే కాదు మంత్రులే కాదు అందరూ నామమాత్రంగా మారిపోయారు. ఇప్పుడు వీరి పని కేవలం అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే. ఇందుకోసం కూడా జగన్ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
ఇందులో జనం వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యేలు బటన్ క్లిక్స్ తమ చేతిలో లేకపోవడంతో వారు తమను లెక్కచేయడం లేదని వాపోతున్నారు. జగన్ అన్ని బటన్స్ నొక్కేస్తే తామేం చేయాలంటూ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు సెటైర్లకూ అదే..
సీఎం జగన్ బటన్ క్లిక్స్ పై విపక్షాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నాయి. బటన్ క్లిక్స్ పేరుతో జగన్ అంతా మాయ చేస్తున్నాయని, క్షేత్రస్ధాయిలో లబ్దిదారులకు బటన్ క్లిక్స్ ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనం అందడం లేదని, ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి జగన్ బటన్ నొక్కుడు వ్యవహారాన్ని పూర్తిస్ధాయిలో టార్గెట్ చేసేందుకు విపక్ష టీడీపీ సిద్ధమవుతోంది.
ఇందులో భాగంగా చంద్రబాబు తాజాగా జగన్ బటన్ పై సెటైర్లు వేశారు. జగన్ పై 11 కేసులున్నాయని, సీబీఐ గట్టిగా బటన్ నొక్కితే ఎక్కడుంటావ్ జగన్ రెడ్డీ అని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా జగన్ బటన్ క్లిక్స్ పై విమర్శలు చేశారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల నాటికీ ఈ బటన్ క్లిక్స్ అంశం మరింత రాజకీయ రంగు పులుముకోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications