బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు...జోరువానలు:హెచ్చరిక
విశాఖపట్టణం:రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు పడుతున్నాయి. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడుతున్నాయి.
Recommended Video
ఇదిలా వుండగా బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. ఈ నెల 13న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం, 16న మరో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. మరోవైపు ఒడిశా పరిసరాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఒడిసాలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు. వీటి ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున సముద్రంపైకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
శుక్రవారం ఏర్పడే అల్పపీడనం బలపడితే శనివారం కోస్తా, తెలంగాణలో విస్తారమైన వర్షాలు కురుస్తాయని తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుతుండగా మరోవైపు రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రానికి కాటన్ బ్యారేజ్ మొత్తం 175 గేట్లను 70మిల్లీమీటర్ల మేర పైకి ఎత్తి 3,068,40 క్యూసెక్కుల ప్రవాహాన్ని సముద్రంలోకి విడిచిపెట్టారు. కాకినాడ పర్లోపేటకు చెందిన మైలుపల్లి దుర్గాప్రసాద్ బోటు బోల్తా పడి మృతి చెందాడు.