చంద్రబాబును చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయి: టీడీపీ ఎమ్మెల్యేల సంచలనం..
విజయవాడ: నిన్నటిదాకా అసలు చర్చలోనే లేని 'ఓటుకు నోటు' కేసు అనూహ్యంగా తెరపైకి రావడం టీడీపీ వర్గాల్లో అలజడి రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇది కచ్చితంగా బీజేపీ గేమ్ ప్లానే అనేది వారి ఆరోపణ.
ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటుకు నోటు కేసుకు చంద్రబాబుకు ఎటువంటి సంబంధం లేదని, అన్యాయంగా ఆయన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబుపై ఈగ వాలినా ఆంధ్రప్రదేశ్ అగ్ని గుండం అవుతుందని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీస్తున్నందునే.. కక్షపూరితంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు ఉందని స్పష్టం చేశారు.
కాగా, ఓటుకు నోటు కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైన సంగతి తెలిసిందే. ఆడియో టేపుల్లోని స్వరం చంద్రబాబుదేనని తేలడంతో కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది. అటు వైసీపీ కూడా ఈ విషయంలో చంద్రబాబుపై ఇప్పటికే తీవ్ర విమర్శలు చేసింది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.