కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదు;సిబిఐ నోటీసులు...ఊహాగానాలే:తేల్చిచెప్పిన డిప్యూటీ సిఎం చినరాజప్ప
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎపికి తెలంగాణాతో అనేక విభేదాలు ఉన్నాయని చినరాజప్ప చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తుపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలకే చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని అప్పగించారని చినరాజప్ప తెలిపారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా....అక్కడి రాజకీయ పరిస్థితులు, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా పొత్తులు ఉంటాయని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ముఖ్యమంత్రిని ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని అందుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చినరాజప్ప అన్నారు. చంద్రబాబుపై 24 కేసులు పెండింగ్ లో ఉన్నాయని , కోర్టులు స్టే విధించాయని చినరాజప్ప తెలిపారు.
ఏపీలో పోలీసులు సరిగా పనిచేయలేదన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని చినరాజప్ప తేల్చేశారు. దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ వాసన పోలేదని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ను తామే ప్రోత్సహించామని చెప్పారు. చంద్రబాబుకు సీబీఐ నోటీసులు కేవలం ఊహాగానాలేనన్నారు. అనంతపురంలో 44 కరువు మండలాలను ప్రకటించామని చినరాజప్ప తెలిపారు.
ఇదిలా వుంటే టీడీపీ కాంగ్రెస్ పార్టీల రహస్య ఎజెండా బయటపడిందని బీజేపీ యువమోర్చా నేత విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ కు వ్యతిరేంగా పుట్టిన టీడీపీని...తెలంగాణ కాంగ్రెస్ కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. గతంలో మన్మోహన్, సోనియా గాంధీని ఇష్టానుసారం దూషించిన టిడిపితో కాంగ్రెస్ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు.
విధానం సిద్ధాంతం లేని పార్టీ టీడీపీ అని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయాల కోసం తెలుగు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డ విష్ణువర్థన్ రెడ్డి...ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరును ఇకపై గాంధీ భవన్ గా మార్చుకోవాలని సూచించారు.